Thursday, May 9, 2024

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయింది..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ డీసీ: కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్-ఆటా-17వ మహాసభలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆలా వెంకటేశ్వర రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, రవీంద్ర కుమార్, చంటి క్రాంతి కిరణ్, గాదరి కిషోర్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆటా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ”అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహా సభలకు హాజరైన తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున నమస్కారాలు. మాకు ఆతిథ్యం ఇవ్వడానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. గత 15 ఏళ్లుగా నేను ఎమ్మెల్యేగా పాల్గొనేవాడిని.. ఈ సారి మంత్రిగా వచ్చా. కరోనా కష్టాలను అధిగమించి రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుపుకుంటున్న తెలుగు ప్రపంచ పండుగ ఈ ఆట మహాసభలు. ఈ పండుగ కోసం మీరంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా ఈ సభలకు ఎప్పుడు పిలుస్తారో… అని రావడానికి చాలా కాలంగా ఎదురు చూశాం.

ఇప్పడు ఆ పండుగ రానే వచ్చింది. ఇలా అందరినీ కలవడం, మనమంతా ఒక కుటుంబం లాగా, గడపడానికి మించిన ఆనందం బహుశా ఎక్కడా దొరకదు. ఈ పండుగలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ, ఈ వేడుకను తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్లంతా, ఈ భూమి పై వేర్వేరు చోట్ల నివసిస్తున్న తెలుగు వాళ్లంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఆటా మహాసభలు ఎంతో ప్రత్యేకమైనవి. మనం ఎక్కడ ఉన్నా, అంతా ఒక్కటే అని చాటే సభలు ఇవి. మనం ఎక్కడ ఉన్నా మన దేశ భక్తిని, కన్న తల్లిని, పుట్టిన ఊరిని మరచిపోలేదని చాటే సందర్భం. ఉన్న ఊరు(usa)ను కూడా మరవని మన విశ్వసనీయతకు గుర్తు ఈ మహా సభలు. మనం ఎక్కడ ఉన్నా, మన పనితనంతో ఇక్కడి, మన దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాం. ఉంటాం. దేశ సంపద పెంపులో, నిర్మాణంలో మనమే ముందున్నం. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అని చెప్పిన రాయప్రోలు సుబ్బారావు గీతం గుర్తుకు తెస్తున్నా. అయన మాటలను అక్షర సత్యాలను చేస్తూ ఈ రోజు ఈ మహాసభలను 17 సార్లుగా నిర్వహిస్తూన్నారు. మన సంస్కృతి, మన భాష, మన యాస, మన దేశం, మన రాష్ట్రం, మన ఊరులను గుర్తుకు చేసుకుంటూ… వాటిని తలచుకుంటూ, నిలుపుకోవాలి అని కోరుకుంటున్నా” అని అన్నారు.

Errabelli Dayakar Rao speech at ATA Convention 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News