Monday, April 29, 2024

హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జైలుపాలైన హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ ఉండనుంది. పోలీసులు శివబాలకృష్ణను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన శివ బాలకృష్ణ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విదితమే. శివ బాలకృష్ణ గతంలో మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. రెరా ఇంచార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు. ఎసిబి కేసుల నేపథ్యంలో శివ బాలకృష్ణను హెచ్‌ఎండిఎ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ సస్పెండ్ చేశారు. అదే విధంగా ఎసిబి తెలంగాణ, ఎపిలో పలు చోట్ల సోదాలు నిర్వహించింది.

శివ బాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్లు తేలిందని ఎసిబి అధికారులు వెల్లడించారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్ కర్నూల్ జిల్లాలో 38, సిద్ధిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. శివ బాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్‌ఎండిఎ, మెట్రో రైల్ అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శివ బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామని ఎసిబి అధికారులు వెల్లడించారు. నిందితుడు శివ బాలకృష్ణపై 13 (1) (బి), 13 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శివ బాలకృష్ణ ఇంటితో పాటు బంధువులు, సహచరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. శివ బాలకృష్ణ ఇంట్లో రూ.99.60 లక్షల నగదు సీజ్ చేశామని స్పష్టం చేశారు. 1988 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. 6 కేజీల సిల్వర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.8.26 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూలో ఇంకా ఎక్కువ ఉంటుందని వెల్లడించారు. మిగిలిన బినామీలపై విచారణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి బాధితుల వేడుకోలు…!
ఎసిబి అరెస్టుతో హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పుప్పాలగూడ సర్వే నెంబర్ 447లో కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూములకు అనుమతులిచ్చారని సూర్యప్రకాష్ అనే బాధితుడు వెల్లడించాడు. తమకు కోర్టు డిక్రీ ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి పర్మిషన్ ఇచ్చాడని తెలిపారు. రఘురామ్ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు హైరేస్ అపార్ట్‌మెంట్స్‌కు అనుమతులు ఇచ్చాడని పేర్కొన్నారు. అక్రమ అనుమతులపై హైకోర్టుకు వెళితే కోర్టును తప్పుదోవ పట్టించి ఫేక్ అఫిడవిట్ వేశారని వెల్లడించాడు. ఆర్‌టిఎ ద్వారా సమాచారం అడిగితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారమివ్వకుండా దాట వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.400 కోట్ల విలువైన 6.36 ఎకరాల భూమిలో అక్రమ పర్మిషన్ ఇచ్చారని బాధితులు వెల్లడించారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారని గతంలో తమను బెదిరించారని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శివ బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారంతా కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News