హైదరాబాద్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో పాల్గొన్నాలని సిఎం కెసిఆర్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో పాల్గొన్నాయి. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై షాద్నగర్ బూర్గుల టోల్గేట్ దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. మంత్రి కెటిఆర్, శ్రీనివాస్గౌడ్తో సహా వందలాది మంది కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. రైతులు తీవ్రవాదులు కాదు అనే ప్లకార్డును కెటిఆర్ ప్రదర్శించారు. రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మద్దతు తెలపాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదన్నారు. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు రైతుల పక్షాలన టిఆర్ఎస్ పోరాడుతుందన్నారు. కడుపు మండిన రైతులు 13 రోజులుగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారన్నారు. నల్లచట్టాలను రైతులపై బలవంతంగా కేంద్రం రుద్దుతోందని కెటిఆర్ మండిపడ్డారు. పార్లమెంటులో మందబలంతో వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 80 శాత అన్నదాతలు సన్నకారు, చిన్నకారు రైతులేనని స్పష్టం చేశారు.
అలంపూర్ వద్ద జాతీయ రహదారిపై మంత్రి నిరంజన్ రెడ్డి, తూప్రాన్ వద్ద మంత్రి హరీశ్రావు, హైదరాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, హన్మకొండ-వరంగల్ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలోని టెక్రియాల్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనలో పాల్గొన్నారు.