Monday, April 29, 2024

తార్నాక ఆస్పత్రిలో వైద్యులకు సన్మానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైద్యుల సేవలు ఎనలేనివని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసి తార్నాక ఆస్పత్రిలోని డాక్టర్లను ఎండి విసి సజ్జనార్ ఘనంగా సన్మానించారు. తార్నాక ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైద్యుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత 55 మంది వైద్యులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం ఎండి విసి సజ్జనార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మనిస్తారన్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లని ఆయన కొనియాడారు. కరోనా కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమై నవని వారి సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, వైద్యులుగా సమాజానికి గొప్ప సేవ చేయవచ్చన్నారు.

ప్రతి రోజూ1500ల మంది ఔట్ పేషంట్లకు…
తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దడంలో ప్రతి వైద్యుడి కృషి ఉందన్నారు. ఏడాదిన్నరగా మీ పనితనాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని, నిబద్ధతతో పనిచేస్తూ టిఎస్ ఆర్టీసికి మంచి పేరును తీసుకువస్తున్నారని ఆయన ప్రశంసించారు. ప్రతి రోజూ సగటున 1500 మంది ఔట్ పేషంట్లకు చికిత్స అందిస్తుండటం మాములు విషయం కాదన్నారు. టిఎస్ ఆర్టీసి తార్నాక ఆస్పత్రి మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలందిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని సజ్జనార్ అన్నారు.

45 రోజుల్లో 45 వేల మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు
ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థ ఆరోగ్యంగా భావించి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టామని సజ్జనార్ గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో 45 రోజుల్లో 45 వేల మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్స్‌ను సిద్ధం చేశామని చెప్పారు. ఆర్టీసి వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించడం వల్లే సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారన్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ విజయంలో ప్రతి వైద్యుడి పాత్ర ఉందన్నారు. భవిష్యత్‌లోనూ ఇలానే పని చేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ మనుగడ బాగుంటుందనే విషయం మరచిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ ఆర్టీసి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కృష్ణకాంత్, మెడికల్ ఓఎస్డీ సైదిరెడ్డి, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News