Saturday, April 27, 2024

మహిళలకు “ఉచిత బస్సు ప్రయాణం” స్కీమ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకలో మహిళలకు ఆదివారం నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటి ఇప్పుడు అమలు లోకి వచ్చింది. దీన్ని శక్తి స్కీమ్‌గా ప్రభుత్వం అభివర్ణిస్తోంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ప్రతిరోజూ 41.8 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రూ.4051.56 కోట్ల భారం పడుతుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి అమలు లోకి వచ్చిన ఈ పథకంలో మహిళలు, విద్యార్థులైన బాలికలు, జెండర్ మైనార్టీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లోనే రాష్ట్రం లోనే ప్రయాణించడానికి వీలవుతుంది. ఈ పథకంలో మహిళలు ప్రభుత్వ పోర్టల్ “సేవా సింధు” రిజిస్టర్ చేసుకోవడం ద్వారా శక్తి స్మార్ట్ కార్డు పొందవచ్చు.

సిటీ ట్రాన్స్‌పోర్ట్, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మొత్తం 18,609 బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది. లక్జరీ, ఇంటర్ స్టేట్ బస్సుల్లో ఇది అమలు కాదు. రాష్ట్రంలో ఒకజిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించినప్పుడు రాష్ట్ర సరిహద్దు దాటితే 20 కిమీ వరకు వారు టికెట్ ఛార్జీ చెల్లించనక్కర లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని విధాన సౌధ సెక్రటేరియట్ నుంచి ప్రారంభించారు. డిప్యూటీ సిఎం డికె శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శక్తి స్కీమ్ లోగోను ప్రారంభించారు. శక్తి స్మార్ట్ కార్డులను ప్రతీకాత్మకంగా ఐదుగురు మహిళలకు పంపిణీ చేశారు. ఈ పథకాన్ని మంత్రులు తమ జిల్లాల్లో ప్రారంభించారు.

ఎన్నికల్లో ప్రకటించినట్టుగా తాము హామీలను అమలు చేస్తున్నామని, అందులో భాగం గానే శక్తి పథకాన్ని ఈరోజు ప్రారంభించామని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వెల్లడించారు. అయితే ప్రతిపక్షం ఈ పథకాల అమలుపై గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. సమాజంలో సగం జనాభా మహిళలే ఉన్నారని, అందువల్ల ఈ పథకానికి శక్తి అని పేరు పెట్టడమైందని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం కల్పించడానికి, వారిని బలోపేతం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్షమని పేర్కొన్నారు. సమయానుకూలంగా మిగతా హామాలను కూడా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News