Monday, April 29, 2024

ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తాం: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: సమాజంలో ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రమాద రహిత సమాజం నిర్మించాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అనే ఉద్దేశంతో ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ  సందర్భంగా పువ్వాడ మాట్లాడారు. నేటి నుండి సెప్టెంబర్ 23వ తేదీ వరకు నిర్విరామంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఖమ్మం నియోజకవర్గ వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. మంత్రి హరీష్ రావు సూచనలతో ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు.

Also Read: 9 ఏళ్ల బాలికపై మైనర్ బాలుర సామూహిక అత్యాచారం

18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పించాలని పువ్వాడ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు అయ్యే ఖర్చు ను పువ్వాడ ఫౌండేషన్ భరిస్తుందని స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం చట్టరీత్యా నేరమని, ఆ జాగ్రత్త వల్ల వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని సూచించారు. సరైన అవగాహన లేకుండా వాహనాలు నడిపితే మనతో పాటు ఎదుట వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన వారం అవుతామని అన్నారు.

నేటి యువత కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి ఉండాల్సిన హక్కు అని, దాన్ని నిర్లక్ష్యం చెయొద్దని, మనం చేసే చిన్నపాటి తప్పిదం వల్ల ఎన్ని విలువైన ప్రాణాలు బలి అయిపోతాయాని వివరించారు. అందుకే యువతను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం నియోజకవర్గంలో అందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తున్నామన్నారు. లైసెన్స్ పొందటానికి అవసరమైన ఫీజు తానే చెల్లిస్తా ఎవరూ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని, ఖమ్మం నియోజకవర్గంలో అందరికీ లైసెన్స్ లు ఉచితంగా అందజేస్తామన్నారు.

ముందు లెర్నింగ్ లైసెన్స్ ఆతరువాత పర్మినెంట్ లైసెన్స్ అందజేస్తారని, ఇక్కడ స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం ఆర్టిఎ కార్యాలయంలో ఫోటో దిగి, సంతకం చేసి మళ్ళీ మన క్యాంపు కార్యాలయంలో ఆయా లెర్నింగ్ లైసెన్స్ పత్రం పొందాలని కోరారు. దీనితో పాటు ఇక్కడే లెర్నింగ్ లైసెన్స్ పొందిన యువతకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామన్నారు. డ్రైవింగ్ పై అవగాహన తో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పై యువతకు అవగాహన కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నారు.

రవాణా శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రికి మాత్రమే ఉండే అధికారంతో ఫాన్సీ నంబర్ లు కేటాయించే విధంగా ఉండేదని, కానీ ప్రభుత్వంకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫాన్సీ నంబర్ ను వేలం ద్వారా నేరుగా ప్రజలకే అందిస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా రవాణా శాఖకు గత ఏడాది కేవలం ఫ్యాన్సీ నంబర్ ద్వారా రవాణాశాఖ కు 74 కోట్ల ఆదాయం వచ్చిందని, అది ఈ ఏడాది వంద కోట్లు దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను రవాణాశాఖ మంత్రిగా బాధ్యత లు చేపట్టిన తరువాత పారదర్శకంగా రవాణాశాఖలో పనులు జరుగుతున్నాయని అన్ని సేవలు దాదాపుగా ఆన్లైన్ లోనే పోనే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. అనంతరం స్లాట్ బుక్ చేసుకున్న వారికి పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఆర్టీఒ కిషన్ రావు, జిల్లా ఆర్టిఎ మెంబర్ వల్లభనేని రామారావు, ఆర్ జె సి కృష్ణ, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, మక్బూల్, మందడపు లక్ష్మి, పకాలపాటి విజయ, దండా జ్యోతి రెడ్డి, నాయకులు పగడాల నాగరాజు, తాజుద్దీన్, తోట వీరభద్రం, కొల్లు పద్మ, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News