Monday, April 29, 2024

పాకిస్థాన్‌తో పోటీ టీమిండియాకు మంచిదే: గౌతం గంభీర్

- Advertisement -
- Advertisement -

ముంబై: ట్వంటీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. దీనిపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించాడు. వరల్డ్‌కప్ మొదటి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో తలపడడం టీమిండియాకు ఒక విధంగా మంచిదేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయమన్నాడు. చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ జరిగిపోతే తర్వాత పోటీల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేందుకు భారత్‌కు అవకాశం ఏర్పడుతుందన్నాడు. సూపర్12లో భాగంగా టీమిండియా అక్టోబర్ 24న జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఢీకొట్టనుంది. ఇరు జట్లకు ఈ వరల్డ్‌కప్‌లో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇందులో గెలిచిన జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఖాయం. దీంతో ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైందన్నాడు.

ఇక వరల్డ్‌కప్‌లో భారత్‌కు దాయాది పాకిస్థాన్‌పై కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్‌లో భారత్ ప్రత్యర్థి పాక్ చేతిలో ఓటమి పాలుకాలేదు. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు టీమిండియా ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని గంభీర్ పేర్కొన్నాడు. ఇక యుఎఇ వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్‌లో హోరాహోరీ సమరం ఖాయమన్నాడు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ తదితర జట్లు ట్రోఫీ కోసం సర్వం ఒడ్డడం ఖాయమన్నాడు. తన దృష్టిలో విండీస్, కివీస్, ఇంగ్లండ్‌లకు ట్రోఫీ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నాడు. పాకిస్థాన్, భారత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేమన్నాడు. యుఎఇ గడ్డపై టోర్నీ జరుగుతుండడం పాకిస్థాన్ అతి పెద్ద ఊరటనిచ్చే అంశంగా గంభీర్ పేర్కొన్నాడు. ఎందుకంటే చాలా ఏళ్లుగా యుఎఇని పాకిస్థాన్ హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకోవడమే దీనికి ప్రధాన కారణమన్నాడు. అంతేగాక ఇక్కడి పిచ్‌లపై పాకిస్థాన్‌కు మంచి పట్టు ఉండడం కూడా వారికి సానుకూలమైన అంశమని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Gambhir reacts on IND vs PAK Match in ICC T20 WC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News