కోల్కతా: తమ తరంలో మ్యాచ్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమేనని భారత మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. టెస్టుల్లోనైనా, వన్డేల్లోనైనా తొలి బంతి నుంచే విధ్వంసక బ్యాటింగ్తో చెలరేగే సెహ్వాగ్ తన కెరీర్లో ఎన్నో మ్యాచుల్లో జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడని గంగూలీ ప్రశంసించాడు. భారత్కు లభించిన ఆణిముత్యాల్లో సెహ్వాగ్ ఒకడన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రత్యర్థి బౌలర్లపై భీకరంగా విరుచుకుపడే సత్తా అతని సొంతమన్నాడు. తమ తరంలో భారత్ సాధించిన విజయాల్లో సెహ్వాగ్దే అత్యంత కీలక పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో సెహ్వాగ్ ఎప్పుడూ విఫలం కాలేదన్నాడు.
ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొనే సత్తా సెహ్వాగ్కు మాత్రమే ఉందన్నాడు. వన్డేలు, టెస్టుల్లో సెహ్వాగ్ అత్యంత కీలక ఆటగాడని అభిప్రాయపడ్డాడు. మరోవైపు భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్గా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ నిలుస్తాడని గంగూలీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్లకు చెందిన అప్పటి అరివీర భయంకర బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఘనత గవాస్కర్కు మాత్రమే లభిస్తుందన్నాడు.