Monday, April 29, 2024

స్నేహితులతో దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు…

- Advertisement -
- Advertisement -
  • అత్కూరు సమీపంలో ఫార్చునర్ వాహనం బోల్తా
  • ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
  • అతివేగం, వాహన చోదకుడిని అజాగ్రత్త వల్లే ప్రమాదం
  • శోకసద్రంలో సౌందర్య కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు

పెద్దేముల్: స్నేహితులంతా కలిసి దైవదర్శనానికి వెళ్ళిన మితృల మద్య రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. మరో గంటన్నరలో దైవ దర్శనం చేసుకుందామనుకునేలోపే స్నేహితుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని ఆత్కూరు గ్రామ శివారులో అదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన పుల్లి సౌందర్య (22) హైదరాబాద్ నగరంలో ఉంటూ గూగుల్‌కు చెందిన కాగ్నిజెంట్ అనే ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆయితే అదివారం సెలవుదినం కావడంతో సౌందర్య అదే కంపెనీలో పనిచేసే సహచర ఉద్యోగులతో కలిసి ఉదయాన్నే ఏపీ16 సీసీ0777 అనే నంబర్ గల ఫార్చునర్ కారులో తొమ్మిది మంది తాండూరు పట్టణానికి వచ్చారు.

మొదటగా అంతారం తండాలోని భూకైలాస్ దేవస్థానానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకున్నారు. భూకైలాస్‌లో దైవ దర్శనం పూర్తి కాగానే వెంటనే కర్నాటలోని బీదర్ శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శనం చేసుకునేందుకు తాండూరు నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో తాండూరు జహీరాబాద్ మార్గమధ్యలోని ఆత్కూరు శివారులోకి రాగానే డ్రైవర్ కుశాల్ ఒక్కసారిగా పక్కనున్న సిమెంట్ స్థంభాన్ని బలంగా ఢీ కొట్టాడు. అయితే కారు అధిక వేగంతో ఉండటంతో ఒక్కసారిగా పల్టీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సౌందర్యకు బలమైన గాయాలవడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కాగా, కారులో ఉన్న కుశాల్, శివాని, సాయిరాభాను, వంశీ, అనిల్, భాను ప్రకాశ్, సాయి, కార్తీక్‌లకు గాయాలయ్యాయి.

క్షతగాత్రులను తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివాని పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కుశాల్ అతివేగంగా, అజాగ్రత్తగా కారును నడపడం వల్లనే ప్రమాదం సంభవించిందని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నుజ్జునుజ్జయిన ఫార్చునర్ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు సౌందర్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి సోదరుడు పుల్లి సాయికృష్ణ ఫిర్యాదు మేరకు వాహన చోదకుడు కుశాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News