హైదరాబాద్ : ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వచ్చే (మే) నెలలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యంతో పాటు కందిపప్పు కూడా అందించనున్నట్టు సమాచారం. తాజాగా పౌరసరఫరాల శాఖ మే నెల రేషన్ సరుకుల కోటా కింద ఉచిత బియ్యం, కందిపప్పుతో పాటు గోధుమలు, చక్కెర కోటాను కేటాయించినట్టుగా తెలుస్తోంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి కార్డుదారుడికి యూనిట్కు 12 కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేయనున్నారు. సబ్సిడీ ధరపై రెండు కిలోల గోధుమలు అందిస్తారు.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఆహార భద్రత కార్డుదారులు సుమారు 16 లక్షల 930 కుటుంబాలు ఉన్నాయి. అందులో 55,75,583 లబ్ధిదారుల(యూనిట్)లకు గాను 6,83,06,702 కిలోల బియ్యం కేటాయించారు. కాగా 16 లక్షల 930 కిలోల కంది పప్పు, 32 లక్షల 1860 కిలోల గోధుమల కోటాను కేటాయించారు. అయితే గోధుమలు, చక్కెర కోటాలకు సంబంధించిన రిలీజింగ్ ఆర్డర్ (ఆర్వో)ల కోసం మాత్రమే మీ సేవా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయాలని పౌరసరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది. దీంతో ఈసారి ఉచిత బియ్యంతో పాటు కిలో కంది పప్పు కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.