మన తెలంగాణ/హైదరాబాద్: అచ్చంపేటలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పర్యాటక సర్కూట్ సమగ్రాభివృద్ధి ప్రాజెక్టు కోసం స్వదేశ్ దర్శన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి రూ.56.84 కోట్ల మంజూరు అయ్యాయని తెలిపారు.
ఈ క్రమంలో భాగంగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు అక్కడ కాటేజీలను నిర్మించినట్లు వెల్లడించారు. మల్లెలతీర్థానికి రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నల్లమలలోని ఆధ్యాత్మిక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని అదేవిధంగా సందర్శించే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా అచ్చంపేట నియోజకవర్గంలోని అక్క మహాదేవి గుహాలకు రూ.1.25 కోట్లు, కడలి వనంకు రూ.11.40 లక్షలు, ఈగల పెంటకు రూ.25.94 కోట్లు, ఫర్హాబాద్కు రూ.13.81 కోట్లు, మల్లెల తీర్ధంకు రూ.5.35 కోట్లు, ఉమా మహేశ్వర దేవాలయం కోసం రూ. 10.35 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
Govt to make Nallamala as Tourism Place: Srinivas Goud