Friday, May 24, 2024

గ్రూప్. 4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ ప్రతినిధి: జులై 1న జరుగనున్న గ్రూప్. 4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గ్రూప్. 4 పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో సూపరింటెండెంట్లు, లైజైనింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జులై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.00 గంటల వరకు పేపర్. 2 పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 47,978 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, అందుకుగాను మొత్తం 161 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

ఇందు కోసం 32 రూట్లలో 32 మంది రూట్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని, జీరాక్స్ సెంటర్లను మూసి వేయాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటుచేయాలని, ఆశా, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఎలాంటి పొరపాట్లకు తావయ్యరాదన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్ష జరిగేలా అని చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులను నియమించడం జరిగిందని చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు పరీక్షా కేంద్రంలో ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు తదితర మౌళిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి గ్రూప్. 4 పరీక్షలు సజావుగా నిర్వహించాలని కోరారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబరు 1800 425 1115 ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News