వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం
రైతు చేతికి అధికారం లభిస్తుంది
కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తాం
వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదంపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి చెందిన రెండు కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ భారత వ్యవసాయ రంగంలో ఇదో శుభదినమని వాఖ్యానించారు. ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తాయన్నారు. అలాగే కోట్లాది మంది రైతుల చేతికి అధికారం వస్తుందన్నారు. పంటలకు కనీస మద్దతు ధరలను కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. రాజ్యసభలో ఆదివారం కీలక బిల్లులు ఆమోదం తర్వాత ప్రధాని ఈ మేరకు వరస ట్వీట్లు చేశారు. ‘దేశ వ్యవసాయ చరిత్రలో ఇదో శుభదినం.
ఈ బిల్లులు వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకు రావడంతో పాటుగా కోట్లాది రైతుల చేతికి అధికారం ఇస్తుంది. దశాబ్దాలుగా రైతు సోదర సోదరీమణులు మధ్యవర్తుల కబంధ హస్తాల్లో చిక్కుకు పోయారు. పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లులు వారికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తాయి. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలన్న మా ప్రయత్నాలకు ఈ బిల్లులు దోహదపడతాయి. అంతేకాదు, మన వ్యవసాయ రంగానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతైనా అవసరం. ఈ బిల్లులతో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది. దీంతో దిగుబడి పెరగడంతో పాటుగా మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి’ అని ప్రధాని అన్నారు. ఇకపై కూడా కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వంనుంచి పంటల సేకరణ కొనసాగుతుందని మోడీ పునరుద్ఘాటించారు. రైతులకు సేవ చేయడానికే తాము ఉన్నామని, వారికి మెరుగైన జీవనాన్ని అందించడమే తమ లక్షమని ఆయన వివరించారు.