Sunday, April 28, 2024

గవర్నర్ ట్వీట్ పై స్పందించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ తమిళి సై ట్వీట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఉస్మానియా ఆస్పత్రి పై మొదట స్పందించింది ముఖ్యమంత్రి కెసిఆర్ అని గుర్తు చేశారు. జూలై 2015లో సిఎం కెసిఆర్ ఆసుపత్రిని సందర్శించారని, నూతన భవనం నిర్మాణానికి అప్పుడే రూ.200 కోట్లు ప్రకటించారన్నారు.  ఆగస్టు 5వ తేదీన కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారని అప్పటినుంచి న్యాయ వివాదంలో ఉందని,
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సైతం ఆసుపత్రి నిర్వహణకు భవనం పనికిరాదని నివేదిక ఇచ్చారని, కోర్టు ఆదేశాల మేరకు ఐఐటి హైదరాబాద్ నిపుణులు, ఆర్కియాలాజికల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ తో ఇండిపెండెంట్ కమిటీని వేశామని, వారు కూడా భవనం ఆసుపత్రి నిర్వహణకు పనికిరాదని స్పష్టం చేశారన్నారు. ప్రభుత్వం కూడా కోర్టుకు అదే విషయం చెప్పిందని, కోర్టు నుంచి సానుకూలంగా నిర్ణయం వస్తుందని భావించామన్నారు.

గవర్నర్ ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వెతికినట్టు రాజకీయంగా బురదజల్లే వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయమన్నారు.  ప్రపంచమే అబ్బురపడేలా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించింది. 100 రోజుల్లో 1.62 కోట్ల మందికి పరీక్షలు చేసి, 45 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని గాని ఇందులో పాల్గొన్న సిబ్బందిని గాని అభినందించడానికి ఎందుకు ఆమెకు మనసు రాలేదని హరీష్ రావు ప్రశ్నించారు. నిమ్స్ 900 నుండి 1500 ఆస్పత్రిలో పడకల సంఖ్యను 1500కు పెంచాం. కొత్తగా 2000 పడకలతో విస్తరిస్తున్నాం. దీనిపై కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదని దుయ్యబట్టారు. కెసిఆర్ కిట్ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి కార్యక్రమాలు అమలు చేసి, ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు పెంచి మాతా శిశు మరణాలను 43 కు తగ్గించాం. ప్రభుత్వ దావఖానాల్లో డెలివరీలను 30 శాతం నుండి 70 శాతానికి పెంచాం. 2014తో పోల్చితే సీన్ రివర్స్ అయ్యింది. ఇవేమీ ఆమెకు ఎందుకు కనిపించలేదని హరీష్ రావు అడిగారు.

దేశంలో 100% ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పిందని, అయినా ఎందుకు అభినందించరని, నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే స్థితి నుంచి నేను వస్తా బిడ్డ సర్కార్ దావఖానకు అనే స్థాయికి చేర్చిన విషయం ఆమెకు కనిపించడం లేదా అని హరీష్ రావు చురకలంటించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దేశంలోనే ఒక చరిత్ర అని, గతంలో 20 ఏళ్లకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే సిఎం కెసిఆర్ 9 ఏళ్లలోనే 21 కాలేజీలను ఏర్పాటు చేసిన విషయంపై గవర్నర్ ఎందుకు స్పందించరని మండిపడ్డారు.

లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఒక డాక్టర్ గా కనీసం ఈ విషయంలోనైనా గవర్నర్ గారు అభినందించాలి కదా? ప్రశంసిస్తే తామింకా ఉత్సాహవంతంగా పనిచేస్తాం కదా? అని అడిగారు. మంచి కనబడదు, మంచి వినబడదు, మంచి మాట్లాడను అన్నట్టుగా వ్యవహరిస్తే ఎలా అని, చెడును మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే మాట్లాడతాం అన్నట్టు వ్యవహరించడం మంచిది కాదని హరీష్ రావు హితువు పలికారు. డయాలసిస్ సెంటర్లు గతంలో మూడు ఉంటే 102 కు పెంచామని, నితి ఆయోగ్ ర్యాంకింగ్లో మూడో స్థానానికి చేరామని ఇది కనిపించదా? అని ప్రశ్నించారు. గాంధీ, నిమ్స్, ఉస్మానియాలో పేదలకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అవయవ మార్పిడి చేస్తున్నారని,  వైద్యుల మనోధైర్యం పెంచేలా అభినందిస్తూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు అని దుమ్మెత్తిపోశారు.

బస్తీ దవాఖానాలను నీతి అయోగ్ సైతం ప్రశంసించిందని, వీటి ఏర్పాటుతో గాంధీ ఉస్మానియా, నిమ్స్, ఫీవర్ హాస్పిటల్ వంటి పెద్ద ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిందని, ఇది ఎందుకు కనబడదని, ఒక వైద్యురాలు అయి ఉండి.. తెలంగాణ వైద్యులు చేసిన కృషి కనిపించకపోవడం బాధాకరమైన విషయమన్నారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళి సై బిజెపి తరుపున రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా అన్ని జిల్లాల డిఎంహెచ్ఒలతో రివ్యూ నిర్వహించామని, కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులు మిషన్ భగీరథ తో దాదాపు తగ్గిపోయాయన్నారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించామని, ఇప్పటికే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా చాలా వరకు తగ్గాయని, ఇంకా వ్యాధులు నమోదు అవుతున్న జిల్లాలో చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. మలేరియాను గుర్తించే 8 లక్షల రాపిడ్ కిట్లను ఇప్పటికే అన్ని పిహెచ్ సిలకు పంపించామని, డెంగ్యూను గుర్తించే 1.23 లక్షల ఎలిజా కిట్లను పంపిణీ చేశామని హరీష్ రావు చెప్పారు. 26 ఆస్పత్రులలో బ్లడ్ కాంపోనెంట్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ప్రక్రియను సులభతరం చేసేలా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పోర్టల్ ను ఆవిష్కరించామని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News