మూడు వాహనాలను
సీజ్ చేయించిన మంత్రి
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించినప్పటికీ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మందలించారు. రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటించినప్పుడే కరోనా మహమ్మారిని పారదోలవచ్చని ఆయన స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను మందలించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తుందని ఆయన చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి రాకూడదని ఆయన వాహనదారులను హెచ్చరించారు.
చాలా మంది వీధుల్లో గుంపులుగుంపులుగా కూర్చోడం, తిరగడం చేస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదని ఆయన పేర్కొన్నారు. అనవసరంంగా రోడ్లపై తిరిగే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ప్రజలందరూ స్వచ్ఛదంగా ఇండ్లలోనే ఉండాలని, దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అసంబద్ధంగా సమాధానాలు ఇచ్చిన ముగ్గురి వాహనాలను మంత్రి సీజ్ చేయించారు. మంత్రి వెంట మునిసిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సిఐ కెయ్యాల సైదులు, ఎఎంసి మాజీ చైర్మన్ వేముల వెంకట్రెడ్డి, కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ తదితరులు ఉన్నారు.