Sunday, April 28, 2024

ఐక్యరాజ్యసమితి ఏం చేస్తోంది?

- Advertisement -
- Advertisement -

రెండవ ప్రపంచ యుద్ధం (1939-45) నేర్పిన గుణపాఠాలను పునాదులుగా చేసుకొని 26 జూన్ 1945 రోజున 51 దేశాల నిర్ణయం ఫలితంగా విశ్వశాంతిని కోరుతూ 24 అక్టోబర్ 1945 రోజున ఐక్యరాజ్యసమితి (ఐరాస) స్థాపించడం అనివార్యంగా జరిగిపోయింది. ‘యునైటెడ్ నేషన్స్ (యుయన్)’ అనే పదాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ రూపొందించారు. అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఐరాసలో నేడు 193 (రెండు పరిశీలన దేశాలుగా ఉండగా) దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. స్వతంత్ర దేశాలుగా గుర్తింపు పొందని నార్త్ సైప్రస్, సొమాలిల్యాండ్, అబ్కాజియా లాంటి రాజ్యాలకు ఐరాస సభ్యత్వం ఇవ్వలేదు.

వాటికన్ సిటీ, పాలస్తీనాలు సభ్యత్వాన్ని పొందలేదు. గత 77 సంవత్సరాలుగా ప్రపంచ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ, పలు వివాదాల పరిష్కారానికి నిర్విరామం కృషి చేస్తూ, మానవాళికి కరోనా మహమ్మారి లాంటి ప్రకృతి విపత్తు జరిగినపుడు ప్రజలను చైతన్య పరిచే ఐక్యరాజ్యసమితి ‘ప్లాటినమ్ జుబ్లీ వేడుకలు’ చేసుకునే స్థాయికి ఎదగడం విశ్వజనావళికి సంతోషదాయకం. అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందిస్తూ, ప్రపంచ దేశాలకు తగు పరిష్కారాలను సూచిస్తూ, ప్రపంచశాంతి స్థాపన యజ్ఞంలో తన వంతు బాధ్యతలను నిర్వహిస్తున్న ఐరాస సేవలు ప్రశంసనీయమని కొనియాడబడుతున్నది.

అంతర్జాతీయ శాంతి స్థాపనలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న యుయన్‌ఒ భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్)లో ఐదు అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, యుకె, ఫ్రాన్స్, చైనాలు శాశ్వత సభ్యులుగా వీటో పవర్‌ను కలిగి ఉండడం ఐరాస బలం, బలహీనత కూడా అవుతున్నది. భద్రతా మండలిలో మరో 10 దేశాలకు 2 సంవత్సరాల వ్యవధితో తాత్కాలిక వీటో లేని సభ్యత్వాన్ని కల్పిస్తారు. మిగిలిన 188 ఐరాస సభ్యదేశాల అభిప్రాయాలకు ప్రాధాన్యం లేదు, వారి అభిమతానికి విలువ ఉండడం లేదు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ముఖ్య పరిపాలనాధికారిగా (సిఎఒ) సేవలందిస్తున్న ఐరాస సంస్థ నిర్దేశిత నియమాలను తీవ్రంగా ఉల్లంఘించిన దేశాలను భద్రతా మండలి సిఫార్సుతో జనరల్ అసెంబ్లీ ఆయా దేశాల సభ్యత్వాన్ని రద్దు కూడా చేయవచ్చు.

ఐరాస ప్రధాన విధుల్లో అంతర్జాతీయ శాంతి, భద్రతల స్థాపన, దేశాల మధ్య స్నేహ బంధాలను నెలకొల్పడం జరుగుతున్నది. దేశాల మధ్య నెలకొన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మానవీయ సమస్యకు పరిష్కారాలు చూపుతూ, మానవ హక్కులను కాపాడుతూ మౌలిక స్వేచ్ఛను కల్పించడం జరుతున్నది. విశ్వ మహమ్మారి విజృంభణ వేళ ప్రజలను జాగృత పరచడం, పర్యావరణ కాలుష్య నియంత్రణ, భూగోళాన్ని పరిరక్షించడం లాంటి అతి ముఖ్యమైన అంశాలలో ప్రపంచ దేశాలను చైతన్య పరచడం జరుగుతున్నది. దేశాల మధ్య సమానత్వం, నమ్మకాలను గౌరవించడం, సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం లాంటి సూత్రాల ఆధారంగా ఐరాస పని చేస్తున్నది.

ఆవిర్భావం నుంచి నేటి వరకు ఐరాస నిర్వహించిన పాత్ర ప్రశంసనీయంగా ఉంటూనే కొన్ని సందర్భాలలో నిరాశనే మిగిల్చిందని చరిత్ర చెబుతోంది. అనేక ఆటంకాలు, సవాళ్ల నడుమ తన ఉనికిని చాటుకుంటూ, ప్రపంచ దేశాలలో శాంతి స్థాపన దిశగా అడుగులు వేస్తున్నది. ఐరాస చరిత్రలో ఎన్ని మైలు రాళ్ళు దాటినా, కొన్ని విషమ పరిస్థితులలో తగు న్యాయం చేయలేకపోయిందనే విమర్శలను మూటకట్టుకుంది. అమెరికా, ఇరాక్ దేశాల మధ్య వివాదం, సూడాన్‌లో అమాయక ప్రజల మరణాలను అరికట్టడంలో ఐరాస విఫలమైందని తెలుస్తున్నది. 24 ఫిబ్రవరి 2022న ప్రారంభమై గత 19 మాసాలుగా కొనసాగుతూ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న భీకర ఉక్రెయిన్, -రష్యా యుద్ధాన్ని నిలువరించడంలో ఐరాస తీసుకున్న చొరవ నామమాత్రమే అని విదితమవుతున్నది.

07 అక్టోబర్ 2023న ఇజ్రాయెల్ ఆవాసాలపై హమాస్ భీకర ఆకస్మిక దాడులతో మొదలైన యుద్ధంలో ఇజ్రాయెల్ పక్షాన కనీసం 1,400 ప్రాణాలు(240 ఇజ్రాయెలీలను బంధించి హమాస్ తమ ఆధీనంలోకి తీసుకోవడం), గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడుల్లో గత నెల రోజులుగా దాదాపు 9,700 (అందులో 4,800 మంది పిల్లలు) వరకు మరణాలు నమోదు అయ్యాయి. ఇజ్రాయెల్, హమాస్ పోరాటంలో గత నెల రోజులుగా గాయపడిన వారి సంఖ్య 50 వేలు దాటి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత నెలకొన్న యుఎస్ ఆధిపత్యం దాదాపు 15 ఏండ్ల పాటు కొనసాగడం చూశాం. 2008 తరువాత అఫ్ఘానిస్థాన్, ఇరాన్ విషయాల్లో అమెరికా ఆధిపత్య చర్యలు చైనాకు నచ్చకపోవడంతో భద్రతా మండలి దేశాల మధ్య విభేదాలు బయటపడడం చూశాం. చైనా క్రమంగా బలపడడంతో యుఎస్ ఆధిపత్యం తగ్గుతూ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొని, నేడు జరుగుతున్న రెండు యుద్ధాల పరిష్కారంలో ఇరుపక్షాలు ఉత్తర దక్షిణ ధ్రువాలుగా దూరం జరగడం పెద్ద సమస్యగా నిలుస్తున్నది. ఈ పోరాటాన్ని శాంతింపజేయడం, కాల్పుల విరమణ అంగీకారానికి ఇరు దేశాలను ఒప్పించడంలో ఐరాస పెద్దన్న పాత్రను పోషించడంలో విఫలం అయినట్లు కనిపిస్తున్నది. అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఐరాస లక్ష్యాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నేడు భద్రతా మండలిలో ఏకాభిప్రాయం రావడం అసాధ్యంగా తోస్తున్నది.

ముఖ్యంగా దేశాల మధ్య సంఘర్షణలు తారస్థాయికి చేరినపుడు భద్రతా మండలి తీర్మానం లేకుండా ఏకాభిప్రాయానికి రావడం జరగదని మనకు తెలుసు. అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణిలతో ఐరాస కార్యదక్షత అయోమయంలో పడుతున్నదని, ప్రపంచ శాంతి స్థాపనకు ఐరాస చేస్తున్న ప్రయత్నాలు దాదాపు శూన్యమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయుధాలతో అగ్రరాజ్య స్థాయి సాధ్యపడదని, విశ్వమానవాళికి సుఖసంతోషాలు పంచగలగడమే పెద్దరికం అవుతుందని భద్రతా మండలి దేశాలు గుర్తించాలి. ప్రపంచ శాంతిస్థాపనలో ఐరాస పెద్దన్నలా నిలబడి, దేశాల మధ్య విభేదాలను చెరిపి, సహకార భావనను పెంచి, ప్రపంచ కుగ్రామాన్ని సుందర ఆవాస ప్రదేశంగా నిర్మించాలని ఆశిద్దాం. భద్రతా మండలిని విస్తరిస్తూ, ఐరాసను గౌరవిద్దాం, ప్రపంచ శాంతికి పునాదులు వేద్దాం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News