బెంగళూరు: లంచం తీసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న ఐఎఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులోని జయనగర్లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిఎం విజయ్ శంకర్(59) అనే ఐఎఎస్ ఆఫీసర్ మిషన్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. విజయ్కు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్గా విజయ్ పని చేస్తున్నప్పుడు ఐఎంఎ వ్యవస్థాపకుడు మహ్మాద్ మన్సూర్ నుంచి 4 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులకు దొరికిపోయాడు. ఐఎంఎ స్కామ్లో అతడు జైలు శిక్ష అనుభవించాడు. 2019 జులై నెలలో బెయిల్పై విడుదలయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. వివి టవర్స్లో జరిగిన సమావేశానికి హాజరైన విజయ్ శంకర్ శనివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. సాయంత్రం ఏడు గంటలకు తన గదిలోకి వెళ్లి రాకపోవడంతో భార్య పలుమార్లు ఫోన్లు చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కిటీకిలో నుంచి అతడు ఉరి పెట్టుకున్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా విజయ్ నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నట్టు గుర్తించారు. ఐఎంఎ స్కామ్ లో అతడిపై పలు చార్జీషీట్లు దాఖలు కావడంతో విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.