Monday, April 29, 2024

భవిష్యత్ కోసమే భారీ విస్తరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం
48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం జిఎంఆర్ అప్పగించాలి
అధికారుల సమీక్షలో మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : హైదరాబాద్ విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలని, హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరమని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరణ జరగాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రోను భారీగా విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. దీనికోసం అవసరమైన 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని జిఎంఆర్‌ను మంత్రి ఆదేశించారు.

హైదరాబాద్ నగరం, మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్‌పోర్ట్ మెట్రో వ్యవస్థపై పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం మెట్రో రైల్ భవన్‌లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు శాఖధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను భారీగా విస్తరిస్తూ, బలోపేతం చేయాలన్న దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామ న్నారు. ఈ దిశగా మెట్రో రైల్ విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకంతకు విస్తరిస్తున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కెటిఆర్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఫీడర్ సర్వీస్‌లను ప్రారంభిస్తే
ఒకవైపు ప్రభుత్వ ఆలోచనల మేరకు మెట్రోరైల్ విస్తరించే కార్యక్రమాల తాలూకు ప్రణాళికలను సిద్ధం చేస్తూనే ప్రస్తుతం మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారిడార్‌లలో మరిన్ని అదనపు కోచ్‌లని పెంచాలని మంత్రి సూచించారు. మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీపైన దృష్టి సారించి మరిన్ని ఫీడర్ సర్వీస్‌లను ప్రారంభిస్తే ప్రస్తుతం ఐదులక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వేతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ పైన తమ వద్ద ఉన్న ప్రణాళికలకు ప్రజేంటేషన్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను అనేక సవాళ్లను దాటుకొని విజయవంతంగా పూర్తి చేసి కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని, తమ అనుభవాలతో భవిష్యత్ మెట్రో ప్రాజెక్టును మరింత వేగంగా పూర్తి చేసే సామర్థ్యం తనకు ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ మొదటి దశ నిర్మాణంలో ఎదురైన సవాళ్లను, సమస్యలను వివరించి అదే విధమైన సమస్యలు తదుపరి మెట్రో నిర్మాణ దశల్లో ఎదురైతే అధిగమించేందుకు అందుబాటులో ఉన్న పరిష్కారాలను కూడా ఈ సందర్భంగా తన ప్రజేంటేషన్‌లో మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్రాన్ని రూ.9 వేల కోట్లను అడిగాం
ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే పైన ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ అధికారులకు పలు ఆదేశాలను, సలహాలను జారీ చేశారు. జిఎంఆర్ ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్టు అథారిటీ వెంటనే 48 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో కోసం కేటాయించాలన్నారు. మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి కెటిఆర్ సూచించారు. లక్డీకాపూల్ నుంచి బిహెచ్‌ఇఎల్, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు విస్తరించాలనుకుంటున్న మెట్రో మార్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇప్పటికే అడిగామని, దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలి
తాజాగా మెట్రోలైన్‌ను భారీగా విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాల్లో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక రిపోర్టులను, తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులను సిద్ధం చేయాలని మంత్రి కెటిఆర్ మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణ కోసం అవసరమైన నిధుల సేకరణ ఉన్న అవకాశాలను వేగంగా పరిశీలించాలని ఈ సందర్భంగా ఆర్థిక, పురపాలక శాఖ అధికారులకు కెటిఆర్ సూచించారు. మెట్రో రైల్ విస్తరణలో భాగంగా మెట్రోస్టేషన్‌లతో పాటు భారీ కారు పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాలకు చెందిన కలెక్టర్లకు కెటిఆర్ ఆదేశించారు.

అక్బరుద్దీన్ ఓవైసీతో మంత్రి కెటిఆర్ సమావేశం
ఈ సమావేశం అనంతరం ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి కెటిఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను చేపట్టామని త్వరలోనే కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మెట్రో అధికారులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న ప్రస్తుత ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మెట్రో అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News