57మందితో తొలి జాబితా విడుదల
న్యూఢిల్లీ: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో సవాళ్లు, ప్రతిసవాళ్ల అనంతరం ప్రతిష్ఠాత్మకమైన నందిగ్రాం స్థానానికి సువేందు అధికారిని బిజెపి తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. బెంగాల్లో 57 స్థానాలకు మొదటి జాబితాను బిజెపి విడుదల చేసింది. ఇందులో నందిగ్రాం స్థానంలో సువేందును నిలబెడుతున్నట్టు బిజెపి స్పష్టం చేసింది. నందిగ్రాం నుంచి టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో, అందరి దృష్టి నందిగ్రాంపైకి మళ్లింది. సంప్రదాయికంగా కోల్కతాలోని భవానీపూర్ నుంచి గెలుచుకుంటూ వస్తున్న మమత తన స్థానాన్ని మార్చుకోవడంతో నందిగ్రాంలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వామపక్షాలు అధికారంలో ఉన్న సమయంలో నందిగ్రాంలో రైతుల ఆందోళన పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు టిఎంసి తరఫున ఆ ఉద్యమానికి నేతృత్వం వహించింది సువేందు అధికారి అన్నది గమనార్హం. 2016లో ఆయన అక్కడి నుంచే ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. ఇటీవల టిఎంసి నుంచి ఆయన బిజెపిలోకి మారిన విషయం తెలిసిందే.
బెంగాల్లోని మొత్తం 294 స్థానాలకు మార్చి 27నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించే 60 స్థానాల్లో 3 మినహా 57 స్థానాలకు బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించింది. మూడింటిలో ఓ స్థానాన్ని భాగస్వామ్య పక్షం ఎజెఎస్యుకు కేటాయించినట్టు బిజెపి తెలిపింది. బెంగాల్లో టిఎంసి ఆటవిక పాలనకు అంతం పలికి బిజెపికి అధికారం కట్టబెట్టేందుకు ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ అన్నారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగసభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ప్రధాని పాల్గొంటున్న మొదటి సభ ఇదే.