న్యూయార్క్ : భారతదేశంలో పేదల సంఖ్య తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడైంది. 2005 2006 నుంచి 20152016 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా తగ్గిన పేదరికం గురించి ప్రపంచ దేశాల సంస్థ నివేదిక వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 27 కోట్ల ముప్పయి లక్షల మంది వరకూ తీవ్రస్థాయి సంక్లిష్ట కోణాల పేదరికం నుంచి విముక్తి పొందారు. ఈ గణాంకాలలో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పేదరిక దశ నుంచి బయటపడ్డట్లు వెల్లడైందని తెలిపారు. అత్యంత తీవ్రస్థాయి పేదరికంలో ఉన్న వారి గురించి ఐరాస సర్వే జరిపింది. ఐరాసకు చెందిన అభివృద్ధి కార్యక్రమాల సంస్థ (యుఎన్డిపి) , ఆక్స్ఫర్డ్ సంస్థ ఒపిహెచ్ఐతో కలిసి పేదరికంపై అధ్యయనం జరిపింది.
మొత్తం 75 దేశాలలో సర్వే జరిపారు. ఇందులో 65 దేశాలు 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం మధ్యకాలంలో సంక్లిష్ట పేదరిక స్థాయి నుంచి బయటపడినట్లు నిర్థారణ అయింది. ఈ మల్టీడైమన్షనల్ పేదరిక స్థాయికి సంబంధించి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దైనందిన జీవితాలలో కష్టాలు, దయనీయ ఆరోగ్య పరిస్థితి, విద్యాలేమి, జీవన ప్రమాణాలు లేకపోవడం, పనిచేసే చోట తగు పరిస్థితులు ఉండకపోవడం. హింసకు గురి కావడం, కలుషిత వాతావరణం లో, కిక్కిరిసిన జనావాసాల మధ్య మురికివాడల లో బతకాల్సి రావడం వంటివాటిని తీసుకుని పేదరిక స్థాయిని లెక్కకట్టారు. ఈ దశ నుంచి పలు దేశాలలో కొంత మేరకు విముక్తి దక్కినట్లు తేల్చారు.
బహుకోణాల పేదరిక స్థాయి నుంచి 65 దేశా లు కొంత మేరకు బయటపడగా, 50 దేశాలలో పేదరికంలో బతికే వారి సంఖ్య తగ్గింది. ప్రత్యేకించి భారతదేశంలో దాదాపు 27 కోట్ల మంది వరకూ దాదాపు 10 సంవత్సరాల వ్యవధిలో అత్యంత సంక్లిష్ట బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రస్తుత కరోనా దశతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయనేది చూడాల్సి ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. పది దేశాలలో ఇప్పటికీ 60 శాతం మంది పిల్లలకు టీకాలు వేయని పరిస్థితి ఉంది. నైజీరియా, ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో కూడా 40 శాతం మంది పిల్లలకు అత్యంత ముఖ్యమైన డిటిపి 3 టీకాలు వేయలేదని కూడా ఐరాస అధ్యయనంలో వెల్లడైంది.