Monday, April 29, 2024

భారత్ జిడిపి 8.8 శాతానికి కోత

- Advertisement -
- Advertisement -

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా


న్యూఢిల్లీ : భారత్ జిడిపిపై ద్రవ్యోల్బణం ప్రభావం కనిపిస్తోంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ భారత్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనాను గతంలో పేర్కొన్న 9.1 శాతం నుంచి 8.8 శాతానికి కోత పెట్టింది. అంటే వృద్ధి రేటు అంచనాను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రేటింగ్ ఏజెన్సీ ప్రకారం, వచ్చే ఏడాది జిడిపి 5.4 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. ముడిచమురు, ఆహారం, ఎరువుల ధరల పెరుగుదల కారణంగా భారతీయ ఆర్థిక పరిస్థితిని వారి ఖర్చు సామర్థ్యం ప్రభావితం చేస్తుందని మూడీస్ నివేదిక పేర్కొంది. ఇటీవల ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ కూడా 2022-23కు జిడిపి 7.3 శాతంగా అంచనా వేయగా, 2023-24లో జిడిపి అంచనా 6.5 శాతంగా పేర్కొంది. ఎస్ అండ్ పి ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంది.

ద్రవ్యోల్బణం ప్రతికూల ప్రభావం

మూడీస్ ప్రకారం, ద్రవ్యోల్బణం రేటు 2022లో 6.8 శాతంగా అంచనా వేయగా, 2023లో అది 5.2 శాతంగా ఉండొచ్చు. ఆర్‌బిఐ ప్రకారం, 2022-23లో ద్రవ్యోల్బణం రేటు 5.7 శాతంగా అంచనా వేసింది. అయితే జూన్‌లో జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్‌బిఐ తాజా ద్రవ్యోల్బణం అంచనాలను విడుదల చేసే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనమైన వినియోగదారుల డిమాండ్, వ్యాపార సెంటిమెంట్‌పై ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా మూలధన వ్యయం (క్యాపెక్స్) రికవరీలో జాప్యం ఉంటుందని బ్రోకరేజ్ హౌస్ మోర్గాన్ స్టాన్లీ గతంలో పేర్కొంది. ధరల పెరుగుదల, పెరుగుతున్న వస్తువుల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అలాగే కరెంట్ ఖాతా లోటు కూడా 10 సంవత్సరాల గరిష్ట స్థాయి 3.3 శాతానికి పెరగవచ్చు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సమస్యలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురుతో సహా కమోడిటీ, ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో భారతదేశం ప్రభావితమైంది. 2022 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి చేరుకోగా, టోకు ద్రవ్యోల్బణం తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 15.08 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బిఇఐ రెపో రేటును పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News