గడ్చిరోలి: ఇన్ఫార్మర్ అనే నెపంతో మాజీ ఉప సర్పంచ్ని మావోయిస్టులు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హీరాలాల్ రామ్సే అనే వ్యక్తి గతంలో మిర్చి తాలుకా నెవఝోరి గ్రామానికి ఉపసర్పంచ్గా పని చేశాడు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరవేస్తున్నాడనే వారు అనుమానించారు. వెంటనే మావోలు నెవఝోరి గ్రామానికి చెరుకొని హీరాలాల్ ఊరు బయటకు తీసుకెళ్లారు. అనంతరం అతడిని తుపాకీతో కాల్చి మృతదేహాన్ని చెట్ల పొదల్లో వేసి వెళ్లిపోయారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. హీరాలాల్ హత్య వెనుక ఇద్దరు కంట్రాక్టర్లు ఉన్నట్టు సమాచారం. ఇద్దరు కంట్రాక్టర్లు మావోయిస్టులకు నిత్యావసర వస్తువులు సమకూరుస్తున్నారనే అనుమానంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు కంట్రాక్టర్ల అరెస్టు వెనక హీరాలాల్ ఉన్నట్టు మావోలు అనుమానించి అతడిని హత్య చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఐపిసి 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.