న్యూఢిల్లీ : వార్తా పత్రికల సమాచార కథనాన్ని వినియోగించుకొంటున్నందుకు తగిన పరిహారాన్ని చెల్లించాలని గూగుల్ను ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) గురువారం కోరింది. ఈమేరకు వచ్చిన ఆదాయంలో ప్రచురణ కర్తల వాటాను 85 శాతానికి పెంచాలని, ఆదాయం పంపకంలో మరింత పారదర్శకత వహించాలని కోరింది. గూగుల్కు రాసిన లేఖలో అడ్వర్టైజింగ్ విధానంలో సరైన పారదర్శకత లేక ప్రచురణ కర్తలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఐఎన్ఎస్ అధ్యక్షుడు ఎల్ ఆదిమూలం పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రచురణకర్తలు ఈ అంశాలను లేవనెత్తుతున్నారని ఐఎన్ఎస్ పేర్కొంది. క్షేత్రస్థాయిలో విశ్వసనీయమైన సమాచార సేకరణకు వేలాది మంది జర్నలిస్టులు నిత్యం శ్రమిస్తుంటారని, వీరికి పత్రికా సంస్థలు తగిన వ్యయం కేటాయిస్తుంటాయని, ఇలాంటి నేపథ్యంలో గూగుల్ పత్రికలకు సరైన చెల్లింపు చేయవలసి ఉందని గూగుల్ భారత విభాగం మేనేజర్ సంజయ్ గుప్తాకు ఆదిమూలం లేఖలో వివరించారు.