Friday, May 17, 2024

ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతుంది

- Advertisement -
- Advertisement -

సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయి
ఆర్థిక, స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదు
మహిళలపై నేరాలు తగ్గుముఖం
హత్యలు, దోపిడి, చోరీ, రోడ్డు ప్రమాదాల కేసులు కూడా పెరుగుదల
సైబరాబాద్ వార్షిక క్రైమ్ రిపోర్ట్ విడుదల సందర్భంగా సిపి అవినాష్ మహంతి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల కొనుగోలుకు సంబంధించిన కేసులో విచారణ కొనసాగుతోందని సైబరాబాద్ సిపి అవినాష్ మహం తి వెల్లడించారు. త్వరలోనే ఈ కేసుపై అన్ని వివరాలు అందిస్తామన్నారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదికను శనివారం విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని తెలిపారు. అలాగే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యా యత్నం కేసులో సైతం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పకడ్బందీగా పని చేస్తామని వెల్లడించారు. ఆర్థిక, స్థిరాస్తి నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నా రు.

అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కమిషనరేట్ సిబ్బంది రెండు నెలలు సమర్థంగా పని చేశారన్నారు. ’గతేడాది సైబర్ క్రైమ్ కేసులు 4,850 ఉంటే, ఈసారి 5,342 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది రూ.232 కోట్ల మోసం జరిగింది. 2023లో 277 డ్రగ్స్ కేసులు నమోదవ్వగా 567 మందిని అరెస్ట్ చేశాం. రూ.27.82 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం.’ అని వెల్లడించారు. 2023లో రెండు పిడి యాక్ట్ కేసులు నమోదు చేశామన్నా రు. ఈ ఏడాది మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. 2022లో 316 అత్యాచారం కేసులు నమోదైతే, ఈసారి 259 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాది పోలిస్తే మోసాల కేసులు పెరిగాయని, 2022లో 6,276 కేసులు రాగా, ఈ ఏడాది 6,777 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో హత్యలు, దోపిడి, చోరీ, రోడ్డు ప్రమాదాల కేసులు కూడా పెరిగాయన్నారు. 2022లో 93 హత్య కేసులు వస్తే ప్రస్తుతం 105 హత్య కేసులు నమోదైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది 52,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే, వాటిలో 1,271 మందికి శిక్షలు పడ్డాయని వెల్లడించారు. ప్రతి అధికారిపై పర్యవేక్షణ ఉంటుందని, సిఫార్సు లేఖలపై పోస్టింగులు ఉండవని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పష్టం చేశారు. అలాగే, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని సిపి అవినాష్ మహంతి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News