అదరగొట్టిన వార్నర్ సేన
మనీష్ విధ్వంసం, రాణించిన శంకర్, హోల్డర్ మ్యాజిక్, రాజస్థాన్పై హైదరాబాద్ గెలుపు
దుబాయి: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అసాధారణ రీతిలో చెలరేగి పోయింది. గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. ఈ విజయంతో సన్రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒక దశలో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ను మనీష్ పాండే, విజయ్ శంకర్ ఆదుకున్నారు. ఇద్దరు మూడో వికెట్కు అజేయంగా 140 పరుగులు జోడించి హైదరాబాద్కు ఘన విజయం సాధించి పెట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన మనీష్ పాండే 47 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 83 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. శంకర్ ఆరు ఫోర్లతో అజేయంగా 52 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు.
రాణించిన శాంసన్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్ శుభారంభం అందించారు. స్టోక్స్ సమన్వయంతో ఆడగా ఉతప్ప మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అయితే జోరుమీదున్న ఉతప్పను హోల్డర్ రనౌట్ చేశాడు. ఉతప్ప రెండు ఫోర్లు, సిక్స్తో 19 పరుగులు చేశాడు. వన్డౌన్లో వచ్చిన సంజు శాంసన్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. స్టోక్స్తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు జాగ్రత్తగా రాజస్థాన్ మళ్లీ పుంజుకుంది. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఇద్దరు సమన్వయంతో ఆడారు. ఈ జోడీని విడగొట్టేందుకు హైదరాబాద్ బౌలర్లు చాలా సేపు వేచి చూడక తప్పలేదు. ధాటిగా ఆడుతున్న శాంసన్ను జాసన్ హోల్డర్ అద్భుత బంతితో క్లీన్బౌల్డ్ చేశాడు. శాంసన్ 26 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్తో 36 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో రెండో వికెట్కు 56 పరుగులు జోడించాడు. ఆ వెంటనే స్టోక్స్ కూడా ఔటయ్యాడు. రక్షణాత్మక ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ రెండు ఫోర్లతో 30 పరుగులు చేసి రషీద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ మళ్లీ పుంజుకోలేక పోయింది. హైదరాబాద్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్తో బౌలింగ్ చేయడంతో స్కోరు ఆశించిన స్థాయిలో పెరగలేదు. కిందటి మ్యాచ్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ ఈసారి నిరాశ పరిచాడు. 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు ధాటిగా ఆడిన కెప్టెన్ స్మిత్ రెండు ఫోర్లతో 20 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్లో ఔటయ్యాడు. రియాన్ పరాగ్ ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 12 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్స్తో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా హోల్డర్కే దక్కింది. ఇక చివర్లో ఆర్చర్ 17(నాటౌట్) మెరవడంతో రాజస్థాన్ స్కోరు 154 పరుగులకు చేరింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
IPL 2020: SRH Win by 8 Wickets against RR