అదరగొట్టిన ఢిల్లీ
పృథ్వీషా మెరుపులు, కోల్కతాపై క్యాపిటల్స్ ఘన విజయం
అహ్మదాబాద్: ఐపిఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చేసింది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది నాలుగో గెలుపు కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (43), రసెల్ (45) మాత్రమే రాణించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రసెల్ 4 సిక్సర్లు, రెండు ఫోర్లతో అజేయంగా 45 పరుగులు చేసి కోల్కతాను ఆదుకున్నాడు. కెప్టెన్ మోర్గాన్ (౦), నరైన్ (0) నిరాశ పరిచారు. దీంతో నైట్రైడర్స్ ఆశించిన స్కోరును సాధించలేక పోయింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 16.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషాలు జట్టుకు శుభారంభం అందించారు. ధావన్ 4 ఫోర్లు, సిక్స్తో 46 పరుగులు చేశాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పృథ్వీషా 41 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు. పృథ్వీషా చెలరేగి ఆడడంతో కోల్కతా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన పృథ్వీషా ఢిల్లీకి ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టాడు. ఇక ఈ మ్యాచ్లో గెలిచి గాడిలో పడాలని భావించిన కోల్కతాకు మరోసారి నిరాశే మిగిలింది.
IPL 2021: DC won by 7 wickets against KKR