Monday, April 29, 2024

ఔట్ సోర్సింగ్ రద్దు చేయాలి !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ రాష్ట్రంలోని 2.5లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్టకొట్టుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అరకొరగా వచ్చే జీతాలను సైతం మూడు నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారని, కొన్ని సార్లు ఆరేడు నెలలైనా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం కర్మన్‌ఘాట్‌లోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో వేలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పులి లక్ష్మయ్య, కె.సంతోష్, వినోద్, అరుణ్‌కుమార్, నారాయణ, బిందు తదితరలు మాట్లాడుతూ

మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించి రెగ్యూలర్ ఉద్యోగులతో సమానంగా పే-స్కేలు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయాలని సూచించారు. మూడేళ్ల సర్వీసు పూర్తి కాని ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేసి ఆదుకోవాలని పేర్కొన్నారు. కారుణ్య నియామకం కింద వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. 2023 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని సూచించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెల జీతాలు అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, మూడు నాలుగు నెలలకోసారి ఒకటి రెండు నెలల జీతాలు చెల్లిస్తున్నారని, మిగిలిన నెలల జీతాలను కాంట్రాక్టు ఏజెన్సీలు నొక్కేస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. ఏజెన్సీల కాంట్రాక్టు కాలపరిమితి ముగిసిన తర్వాత నెలల తరబడి ఉద్యోగుల సర్వీసులను రెన్యూవల్ చేయడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు.

నాలుగైదు నెలలు ఆలస్యంగా రెన్యూవల్ చేస్తున్నారని, ఆ నెలలకు సంబంధించిన ఈఎస్‌ఐ, పీఎఫ్‌తో పాటు వేతనాలను సైతం కొన్ని సార్లు చెల్లించడం లేదన్నారు. కొత్త ఏజెన్సీల వచ్చి అప్పటికే ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయని, రూ.లక్షలు వసూలు చేసి కొత్త వారిని నియమించుకుంటున్నాయని, ఈ విషయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు సైతం వారికి సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. పాత వాళ్లు కొనసాగలంటే మళ్లీ కొత్త ఏజెన్సీలకు భారీ మొత్తంలో లంచాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. లేకుంటే వయోపరిమితి మించిపోయిందని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్లో రాజకీయ నేతలే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను నిర్వహిస్తుండడంతో వారి అగాడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు.

వీఆర్‌ఏలు కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ?
వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ ప్రభావం పశుసంవర్థక శాఖలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న వందల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై పడింది. పెద్ద సంఖ్యలో వీఆర్‌ఏలను తమ శాఖకు కేటాయించారని, ఇకపై మీరు విధులకు రావాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే నాలుగైదు జిల్లాల్లో పశుసంవర్థక శాఖ ఆఫీస్ సబార్డినేట్లకు స్థానిక అధికారులు తేల్చి చెప్పారని ఆత్మీయ సమ్మెళంకు హాజరైన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ కాలపరిమితి ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తమ ఉద్యోగాలను రెన్యూవల్ చేయలేదని, ఈ నేపథ్యంలో తమను ఉద్యోగాలకు రావద్దంటున్నారని పేర్కొన్నారు.

వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు అవసరమైన ఖాళీ పోస్టుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కోరగా, పశుసంవర్థక శాఖ రాష్ట్ర కార్యాలయం అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పోస్టులను సైతం ఖాళీలుగా చూపించడంతో ఈ సమస్య తలెత్తిందని, దీంతో వారిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జేఏసీ నేతలు తెలిపారు. దాదాపు 520 మంది ఆఫీస్ సబార్డినేట్లతో పాటు మరికొంత మంది జూనియర్ అసిస్టెంట్ల నెత్తిపై కత్తి వేలాడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వీరి సేవలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ప్రసాద్, కృష్ణ, గోవర్ధన్, జహీరుద్దీన్, శ్రీధర్, జగదీష్, శ్రీనాథ్‌గౌడ్, విజయలక్ష్మీ, సునీత, రాజిరెడ్డి, సురేందర్, సంధ్య, యాదయ్య, నాజర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News