Monday, April 29, 2024

ఎసిసి అధ్యక్షుడిగా తిరిగి జై షా ఎన్నిక

- Advertisement -
- Advertisement -

బాలీ: ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఎసిసి) అధ్యక్షుడిగా బిసిసిఐ కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాలీలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో జై షాను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం.

శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్వా అధ్యక్షుడిగా జై షా పేరును ప్రతిపాదించారు. దీనికి కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. జై షా 2021 జనవరిలో తొలిసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, తనపై నమ్మకం ఉంచి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఎసిసి బోర్డు సభ్యులకు జై షా కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని, ఆసియాలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తానని హామీ ఇచ్చారు.

ఆట ఎక్కువగా అభివృద్ధి చెందని ప్రాంతాలపై దృష్టి పెట్టి క్రికెట్‌ను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఎసిసి అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్న జై షాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆసియాలోని పలు క్రికెట్ బోర్డులకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు జై షాను అభినందించారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు కూడా జై షాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News