హైదరాబాద్: నగరంలో పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు ట్యాంక్ బండ్ వైపు పయనమవుతున్నారు. సోమవారం ఉదయం 11గంటల నుంచి మహాగణపతి ఊరేగింపు ప్రారంభం కానుందని ఉత్సవ సమితి పేర్కొంది. మధ్యాహ్నం 3గంటలలోగా ఖైరతాబాద్లో కొలువుదీరిన మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. నేడు వినాయకుల నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఉదయం 6గంటల నుంచి రేపే ఉదయం ఆరుగంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
అర్థరాత్రి నుంచే నగరంలోని అంతర్ రాష్ట్ర, జిల్లాల లారీలకు, ప్రైవేట్ బస్సులకు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా నేడు పలుచోట్ల ఆర్టీసీ బస్సులకు దారి మళ్లిస్తున్నారు. విమానాశ్రం, రైల్వేస్టేషన్ లకు వెళ్లేవారు నిమజ్జన యాత్ర గుండా వెళ్లకుండా, ప్రత్యామ్నాయ దారులుగుండా ప్రయాణికులు వెళ్లాలని అధికారులు సూచించారు. గూగుల్ మ్యాప్స్ లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు పోలీసులు సూచనలు తెలియజేస్తున్నారు. నగర వాసుల కోసం 040-27852482, 9490598989, 9010303626 నంబర్లను ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేడు మద్యం, కల్లు దుకాణాలు బంద్. గణేష్ నిమజ్జనం దృష్ట్యా బంద్ పై సిపి మహేష్ భగవత్ నోటిఫికేషన్ విడుదల చేశారు.