అనారోగ్యంపై వస్తున్న వార్తలకు బ్రేక్
ఎరువుల కరాగారాన్ని ప్రారంభించిన ఫొటోలు విడుదల చేసిన ఉ.కొరియా
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ 20రోజుల తర్వాత ఎట్టకేలకు కనిపించారు. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున వార్తలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్చిన్లో ఎరువుల కర్మాగార నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఆ ఫాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నట్టు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో కిమ్తోపాటూ అతని సోదరి కిమ్ యో జోంగ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. దానికి ఆధారంగా కిమ్ ఫొటోలను కూడా విడుదల చేశారు. అంతేకాకుండా ఆయన ఎలాంటి అనారోగ్యానికి గురైనట్లు ఎలాంటి ఆనవాళ్లు వాళ్లు విడుదల చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది.
గతంలో మోకాలు సర్జరీ జరిగిన తర్వాత నడిచేందుకు చేతి కర్ర సాయం తీసుకున్న కిమ్ తాజాగా అది కూడా చేతిలో ఎలాంటి సపోర్ట్ లేకుండా కనిపించడం విశేషం. నల్లని మావో సూట్ ధరించి దర్జాగా నడుస్తూ కనిపించాడు. ఎరువుల కర్మాగారం చుట్టూ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడక ద్వారానే పరిశీలించారు. ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరిగింది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. తాజా పరిణామంతో ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.