వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి న్యూజిలాండ్ పర్యటన కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇప్పటికే వన్డే సిరీస్లో క్లీన్స్వీప్కు గురై ఇంటాబయటా విమర్శలను ఎదుర్కొంటున్న విరాట్కు తాజాగా తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాజయం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకడిగా పేరున్న కోహ్లి కివీస్ సిరీస్లో మాత్రం వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. వన్డేల్లో అంతంత మాత్రంగానే రాణించడంతో దాని ప్రభావం జట్టుపై స్పష్టంగా కనిపించింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే ఏ జట్టుకైనా ఇబ్బందులు తప్పవు. అయితే కివీస్ గడ్డపై మాత్రం కోహ్లి పెద్దగా రాణించలేక పోతున్నాడు. జట్టుకు అండగా నిలువాల్సిన స్థితిలో వికెట్ను పారేసు కోవడం అలవాటుగా మార్చుకున్నాడు.
వన్డేల్లో మూడు సార్లు కూడా కీలక సమయంలో పెవిలియన్ దారి పట్టాడు. దీంతో గెలవాల్సిన మ్యాచుల్లో కూడా జట్టుకు ఓటమి తప్పలేదు. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో కూడా కోహ్లి వైఫల్యం చవిచూశాడు. రెండు ఇన్నింగ్స్లలో కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. జట్టుకు అండగా నిలువాల్సిన కెప్టెన్ విఫలం కావడంతో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయి.
ఎటువంటి బౌలింగ్నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా కలిగిన కోహ్లి కివీస్ గడ్డపై మాత్రం తన జోరును కొనసాగించలేక పోతున్నాడు. కాగా, వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విరాట్ కోహ్లిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లి విఫలమవుతున్నాడని, అతనికి కాస్త విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఎడతెరిపి లేని క్రికెట్ వల్లే కోహ్లికి ఇలాంటి ఎదురవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.