మెల్బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లి చాలా తెలివైన క్రికెటర్ అని అభిప్రాయపడ్డాడు. సందర్భోచితంగా వ్యవహరిస్తూ జట్టును ముందుకు నడిపించడంలో కోహ్లికి ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఓ ఇన్స్టా లైవ్లో పాల్గొన్న వేడ్ ఈ విషయాలు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి ఓ కొత్త ఒరవడిని సృష్టించాడన్నాడు. బ్యాట్స్మన్గా, కెప్టెన్గా, బ్యాట్స్మన్గా కోహ్లి జట్టుపై తనదైన ముద్ర వేశాడన్నాడు. సహచరుల్లో ఉత్సాహాన్ని నింపడంలో కోహ్లి అనుసరించే విధానం చూడముచ్చటగా ఉంటుందన్నాడు. సమకాలిన ప్రపంచ క్రికెట్లో ఏ కెప్టెన్ కూడా కోహ్లిలా దూకుడుగా వ్యవహరించలేక పోతున్నాడన్నాడు.
మరోవైపు టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా తీర్చిదిద్దడంలో కోహ్లి పాత్రను కూడా వేడ్ ప్రశంసించాడు. ఆటగాళ్లలో విజయకాంక్షను రగిల్చి వారిని మ్యాచ్ విన్నర్లుగా తయారు చేయడంలో కోహ్లి సఫలమయ్యాడన్నాడు. ఇక, ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో స్లెడ్జింగ్ సందర్భాన్ని బట్టి తమకు అనుకూలంగా మలచుకోవడంలో టీమిండియా ఆటగాళ్లు ఎంతో పరిణితి సాధించారన్నాడు. ఇది కూడా టీమిండియా బలమైన జట్టుగా ఎదిగేందుకు దోహదం చేసిందన్నాడు. ఇక, సుదీర్ఘ కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్న తాను ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని వేడ్ వివరించాడు. త్వరలోనే సాధన ప్రారంభిస్తానని తెలిపాడు. కాగా, ఇటీవలే వేడ్ మోకాలి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.