Monday, April 29, 2024

1న చలో మేడిగడ్డ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడిగడ్డపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగడుతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చ్ 1వ తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతామని స్పష్టం చేశారు. దశల వారిగా ఆ తర్వాత కాళేశ్వరంలో ఉన్న ప్రతి రిజర్వాయర్ ను సందర్శిస్తామని, మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తాము అంటే వారిని కూడా వెంట తీసుకువెళ్తామని నొక్కి చెప్పారు. ప్రజలకు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తామన్నారు. పాడైన బారాజుల మరమ్మతుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయని, సులువుగా ఒక కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆ మూడు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే తాము చెప్పామన్నారు. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యమని,  కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయని గుర్తు చేశారు.

కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమ్మతులు నిర్వహించాలని, రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేమని, సాగునీరు ఎట్లిస్తాం అని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారని, అవసరమైతే బిఆర్ఎస్ పైనా దుష్ప్రచారం చేయండి కానీ ఇంకేమైనా చేయండి కానీ రైతుల జీవితాలను మాత్రం దెబ్బతీయకండని, వారి పంట పొలాలను ఎండబెట్టకండని సూచించారు.

మూడు పిల్లర్ల నష్టాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ మానివేసి, ప్రాజెక్టు మరమ్మతుల పైన దృష్టి సారించాలని, మరమ్మతులు నిర్వహించకపోతే మూడు బారాజులు కొట్టుకుపోవాలని కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తుందని దుయ్యబట్టారు. రానున్న వర్షాకాలంలో మూడు బరాజులను, వచ్చే వరదలో కొట్టుకపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని, నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారని, అన్నారం, సుందిల్ల కూడా కొట్టుకుపోతుందని చెప్పారని, ఇది ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమేనిని ఆయన మండిపడ్డారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టాలని సూచించారు.

కాంగ్రెసోళ్లు తప్పకుండా కమిటీలు, రిపోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా సమస్యకు పరిష్కారం చూపించాలని, రాష్ట్ర రైతాంగంపైన మా పార్టీపైన కక్షపూరిత వైఖరి మానేయాలని, నిజంగా కాంగ్రెస్ పార్టీకి రైతులపైన… తెలంగాణ పైన ప్రేమ ఉంటే ప్రాజెక్టుకి మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం నేరపూరిత మనస్తత్వంతోనే బరాజ్ లకు రిపేర్లు చేయకుండా రోజుకు వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు కూడా సముద్రంలోకి వదిలిపెడుతుందని చురకలంటించారు. ఇందులో కాళేశ్వరం బ్యారేజీలు అన్ని వర్షాకాలంలో కొట్టుకుపోవాలనే పెద్ద కుట్ర జరుగుతుందని, ఈ రోజు కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న కాగ్ రిపోర్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి మొదలుకొని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరూ కాగ్ రిపోర్టుని తప్పుపట్టారని గుర్తు చేశారు. కాగ్ రిపోర్ట్ ఒక పవిత్ర గ్రంథం ఏం కాదు అని, కాగ్ రిపోర్ట్ తప్పు అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని, ఇది కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్ జిల్లా యజ్ఞాన్ని అనేక భూముల కేటాయింపును కల్వకుర్తిలో 900 కోట్ల రూపాయలకు గురించి అనేక అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించిందని, మరి కాగ్ రిపోర్టు అప్పుడు తప్పు అయితే మరి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలని కెటిఆర్ నిలదీశారు.

అప్పటి కాగ్ రిపోర్ట్ విషయంలో ధ్వంధ ప్రమాణాలు ఎందుకు అని ప్రశ్నించారు. వేరువేరు వాదనలు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ప్రజలు గుర్తించాలని, కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుందని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించాలని సవాల్ విసిరారు. ఆనాడు నది జిల్లాల కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేశారని, నీళ్ల కోసం, నిధుల కోసం అనేక ఉద్యమాలు చేశారని, బాసర నుంచి భద్రాచలం దాకా పారుతున్న గోదారి జలాల కోసం ఉద్యమాలు నిర్వహించారని, ఎన్ని ఉద్యమాలు చేసినా గోదావరి నీళ్లను ఆనాటి పాలకులు తెలంగాణకు అందించలేక పోయారని మండిపడ్డారు. 60 ఏళ్ల పాటు తెలంగాణకు నీళ్లు ఇవ్వక కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అని, గద్దర్ అన్న, సదాశివుడు లాంటి వాళ్ళు తెలంగాణ గోదారి నీళ్ల రాని గోసను ప్రజలకు వివరించి చెప్పారని, కెసిఆర్ జలసాధన పోరాటం ద్వారా పల్లె పల్లెను జాగృతం చేశామని, కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం పేరుతో నాటకాలకు తెరలేపిందని కెటిఆర్ ధ్వజమెత్తారు. పదేళ్లపాటు నాటకాలు ఆడి జల యజ్ఞాన్ని ధనయజ్ఞం గా మార్చుకుందని,ఢిల్లీ- మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంతో  ఒప్పందం చేసుకోకుండా తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తవ్వలేదు ఎందుకు అని ప్రశ్నించారు. ఒక్క కాలువ కూడా తవ్వకుండా మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచుకున్నారని, ఆనాటి జల యజ్ఞంలో 52,000 కోట్ల అవినీతి అని కాగ్ రిపోర్ట్ ఎండగట్టిందని, 10 ఎండ్లలో ప్రాజెక్టులకు ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా సాధించని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ నిపుణులతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మహారాష్ట్రతో సంప్రదించిన తర్వాత గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చామని చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్, తుమ్మిడి హాట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదు అన్న తర్వాతనే… నిపుణుల సలహాలు, సంప్రదింపుల తర్వాతనే మేడిగడ్డ వద్ద నీళ్లు తీసుకోవడం మేలని కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని కెటిఆర్ తెలియజేశారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు అని

3 బ్యారేజీలు..
15 రిజర్వాయర్లు..
21 పంప్ హౌజ్ లు..
203 కిలోమీటర్ల సొరంగాలు…
1531కిలో మీటర్ల కాలువలు..
98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్..
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ..
530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత..
240 టిఎంసీల వినియోగం !
అన్నింటి సమహారమే కాళేశ్వరం అని ప్రశంసించారు.

88 మీటర్ల పల్లం నుంచి 618 మీటర్లు ఎత్తుకు గోదారి గంగ ఎగిసి దుంకే..జలదృశ్యాన్ని ఆవిష్కరించామని పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, తెలిసినా తెలవనట్లు నాటకాలు ఆడుతున్నారని, అందుకే కాళేశ్వరంలో పొంగిపొర్లుతున్న నీళ్లను ప్రజలకు చూపిస్తామని, దుష్ప్రచారం చేస్తున్న మేడిగడ్డకు కూడా మా పార్టీ ప్రతినిధి బృందం వెళ్తోందని, కెసిఆర్ నల్లగొండ సభలో చెప్పినట్లు కాళేశ్వరంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శించి ప్రజలకు వివరిస్తామన్నారు.

లక్ష కోట్ల కాలేశ్వరం అని ఒకవైపు, 3000 కోట్లతో కట్టిన మేడిగడ్డను చూపించి ఇదే కాళేశ్వరం గురించి దుష్ప్రచారం చేస్తున్నారని, మేడిగడ్డలో పాడైన మూడు పిల్లర్లను చూపించి కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 40 లక్షల ఎకరాలకు నీరు అందించే కామదేనువు కాళేశ్వరం ప్రాజెక్టు అని, కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టు కట్టకుండా అడ్డంకులు సృష్టించిందని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కెసిఆర్ కి పేరు వస్తుందని దుర్మార్గంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుట్రలకు దాటుకుని 400 పైగా అనుమతులు సాధించామని, కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16.4 టిఎంసిలు, రిజర్వాయర్లు లేకుండా ప్రాజెక్టు ఉంటే, 142 టిఎంసిలు రిజర్వాయర్లను కాళేశ్వరంలోనిర్మించామని, తెలంగాణ కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు ద్వారా 40 లక్షల ఎకరాలను చేసే ప్రాజెక్టు అని తెలియజేశారు.

తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల పరిమితుల వల్లనే ఎంత ఖర్చైనా ఎత్తిపోతల పథకాల ద్వారానే నీళ్లు ఇస్తామని, నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ రైతన్నల కోసం ఎంత ఖర్చైనా నీళ్లు ఇవ్వక తప్పదని, కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న మేధావులు కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు. ఆకలికేకల తెలంగాణ అన్నం గిన్నగా మారిందని, దేశానికి అన్నపూర్ణగా అయిందని ప్రశంసించారు. మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించారని, రైతుల మూడు లక్షల ఎకరం ఈ రోజు 30 లక్షలు అయిందన్నారు. ఇవన్నీ కాళేశ్వరం ద్వారా అందిన ప్రతి ఫలాలు కాదా? అని అడిగారు. కాళేశ్వరం ద్వారా అందిన ఆయకట్టు మీద చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న వాళ్లు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎస్ఆర్ ఎస్ పి కట్టిన తర్వాత 25 వేల ఎకరాలకు నిలిచిందని,  నాగార్జునసాగర్ కట్టిన 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్లు వచ్చాయని, కల్వకుర్తి కట్టి 30 ఏళ్ల తర్వాత 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News