Sunday, May 12, 2024

భాగ్యనగరం మరింత సురక్షితం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో 10 లక్షల సిసి కెమెరాలుండాలి
సైబర్ క్రైమ్ నేరాలపైన ప్రత్యేక దృష్టి సారించాలి
శాంతి భద్రతల నిర్వహణలో కెమెరాల పాత్ర కీలకం
నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో కీలకం
పోలీస్ శాఖ, పురపాలక శాఖతో సంయుక్త సమావేశం నిర్వహించిన మంత్రి కెటిఆర్

 KTR Meeting with Police and Municipal Departments

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్ధాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికల ను యుద్ధప్రాతిపదికన రూపొందించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడ, ఎలాంటి ఘటనలు జరిగినా తక్షణమే పోలీసులకు సమగ్ర సమాచారం లభించే విధంగా పెద్ద ఎత్తున సిసి కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న నగరంలో ఉన్న 5.80 లక్షల సిసి కెమెరాల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరముందని మంత్రి అభిప్రాయపడ్డారు. మొత్తంగా పది లక్షల కెమెరాలు ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను యుద్ధ ప్రాతిపదికన సిద్దం చేయాలన్నారు. రాష్ట్ర డిజిపి, మూడు నగర కమిషనరేట్ల పోలీసు కమిషనర్లతో పాటు జిహెచ్‌ఎంసి, మున్సిపల్ శాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పలు సూచనలు, ప్రతిపాదనలు చేశారు.

ప్రస్తుతమున్న సిసి కెమెరాలతో దేశంలోనే అత్యధిక నిఘనేత్రాలు(సిసి కెమెరాలు) కలిగిన నగరంగా హైదరాబాద్ కొనసాగు తోందన్నారు. వీటిపై ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానంలో కొనసాగుతున్నట్లుగా తేలిందన్నారు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆ దిశగానే ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్ లో శాంతి భద్రతలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా నగరంలో శాంతి భద్రతలను సాఫీగా కొనసాగించే పరిస్థితులను సిఎం కెసిఆర్ సంకల్పించారన్నారు. హైదరాబాద్ అన్ని విధాలుగా సురక్షితమైన నగరంగా కొనసాగుతున్నందున కారణంగానే పెట్టుబడులు సైతం పెద్దసంఖ్యలో వస్తున్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ మరింతగా విస్తరించనుందన్నారు. ఈ నేపథ్యంలో పట్టణీకరణలో భాగంగా నగరంలో మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల ప్రస్తుతమున్న సిసి కెమెరాలకు తోడుగా నూతనంగా పట్టణీకరణ చెందుతున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ కొత్తగా కెమెరాలను ఏర్పాటు చేసే అంశంపై పరిసర మునిసి పాలిటీలు, కార్పొరేషన్లతో కలిసి పనిచేయాలని పోలీసు శాఖకు మంత్రి కెటిఆర్ సూచించారు.

ఇందులో భాగంగా ప్రస్తుతం జిహెచ్‌ఎంసి నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, రోడ్లు వంటి చోట్ల కొత్తగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు పార్కులు, చెరువులు, బస్తీ దవాఖానలు, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్లను సిసి కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. నగరంలో ప్రజలు అధికంగా గూమి కూడే ప్రతి చోట సిసి కెమెరాల నిఘా ఉండాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మొదలైనచోట్ల వీటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. త్వరలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానుందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. త్వరలో తీసుకురానున్న నూతన జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ చట్టాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఏమైనా ప్రత్యేక అంశాలను చేర్చాల్సిన అవసరం ఉన్నదా? అని ఈ సందర్భంగా పోలీసు అధికారులను మంత్రి కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు.

అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలపైన భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా పోలీస్ శాఖ నుంచి ఆయన తగు
సమాచారాన్ని తీసుకున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జిహెచ్‌ఎంసి తరఫున తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మంత్రి కెటిఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ సిబ్బందితో పాటు సైబర్ వారియర్‌లను పోలీస్ శాఖ తయారు చేసుకోవలసిన అవసరముందని సూచించారు. కట్టుదిట్టంగా శాంతిభద్రతలను నిర్వహిస్తున్న హైదరాబాద్ పోలీస్ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయాన్నిఈ సందర్భంగా పోలీసు అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, మంత్రి కెటిఆర్ సూచించిన విధంగా పది లక్షల సిసి కెమెరాలను ఇన్‌స్టాల్ చేసే లక్ష్యాన్ని స్వీకరించి ఆ దిశగా కార్యక్రమాలు ప్రణాళికలు కొనసాగిస్తామన్నారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన ప్రోద్భలంతోనే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ద్వారా శాంతి భద్రతలను గట్టిగా నిర్వహించే కలుగుతుందని ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న సిసి కెమెరాల ద్వారా నేరాల సంఖ్య పెద్దఎత్తున తగ్గిందని, నేరాలు జరిగిన వెంటనే నేరస్థులను అదుపులోకి తీసుకునేందుకు కెమెరాల ఫీడ్ చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా హోం మంత్రి అన్నారు. హైదరాబాద్ నగర అవసరాల దృష్ట్యా జిహెచ్‌ఎంసి, పోలీస్ శాఖ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డితో పాటు నగర పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల కమిషనర్లు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్, ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 KTR Meeting with Police and Municipal Departments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News