Monday, April 29, 2024

కెటిఆర్ పాంచ్ పంచ్ ఎవరికో..?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ సిరిసిల్ల అభ్యర్థి కెటిఆర్ మినహా మిగిలిన వారందరూ ఇప్పటి వరకు శాసనసభలో కాలు పెట్టని వారే కావడం విశేషం. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ సాగుతోంది. సిరిసిల్ల నియోజక వర్గం ఆవిర్భవించిన నాటి నుంచి కెటిఆర్ ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుటున్నారు. మూడుసార్లు కెటిఆర్‌పై పోటీ చేసి పరాజయం పాలైన కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ సారి కూడా బరిలో ఉంటున్నారు.

బిజెపి అభ్యర్థిగా రాణి రుద్రమారెడ్డి బరిలో నిలవగా, బిఎస్‌పి నుండి పిట్టల భూమేష్ పోటీ చేస్తున్నారు. స్వతంత్రులుగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్, పత్తిపాక సురేష్, కేసుగాని పరమేశ్వరి,కౌటె గణేష్ తదితరులు ఇప్పటి వరకు బరిలో నిలుచుండగా, వేములవాడ నియోజక వర్గంలో మొదటి సారిగా అధికార పార్టీ అభ్యర్థిగా చలిమెడ లక్ష్మీకాంతరావు రంగంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడలో పోటీ చేసి ఓటమి చెందినా పట్టువదలని విక్రమార్కుడిగా మరో సారి బరిలో ఆది శ్రీనివాస్ ఉంటున్నారు. బిజెపి అభ్యర్ధిగా తుల ఉమ రంగంలోకి రాగా, బిఎస్‌పి అభ్యర్థిగా డా. గోళి మోహన్ బరిలో ఉన్నారు.

ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా గుగ్గిళ్ల రవీందర్ ఉండాగా మరి కొందరు స్వతంత్రులుగా బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సిఎం కెసిఆర్ సిరిసిల్లలో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించడమే కాకుండా సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటల్లో ఆత్మీయ యువ సమ్మేళనాలు నిర్వహించి కెటిఆర్ ప్రచార బరిలో ముందున్నారు. మంత్రి కెటిఆర్ 2009లో మొదటి సారి పోటీ చేసినప్పుడు పోలైన ఓట్లలో 26.9 శాతం (36,783) ఓట్లు సాధించి ప్రత్యర్థి అయిన కెకె మహేందర్ రెడ్డిపైన కేవలం 0.01 శాతం (171 ఓట్ల) తో విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికల్లో మెజార్టీని కొంత మెరుగు పర్చుకున్నారు. 2014లో మెజార్టీని మరింతగా అభివృధ్ధి పర్చుకున్నారు.

2018లో నాలుగో సారి మహేందర్ రెడ్డిపై 88,601 ఓట్ల ఆధిక్యాన్ని కనపరిచారు. మంత్రి కెటిఆర్ ఎప్పటి కప్పుడు తన మెజార్టీని పెంచుకుంటూనే పోతుండటం విశేషం. వెలమ కులస్థులకు పెట్టని కోటగా మారిన సిరిసిల్ల నియోజకవర్గం చరిత్రలో చెన్నమనేని రాజేశ్వరరావు ఐదుసార్లు (1967,1978,1985,1994,2004) శాసన సభ్యునిగా గెలుపొందినా ఆయన వరుసగా ఎప్పుడూ రెండో సారి గెలువక పోవడం గమనార్హం. జువ్వాడి నర్సింగరావు రెండు సార్లు (1962,1972)లో గెలుపొందినా ఆయన కూడా వరుసగా రెండో సారి గెలవలేకపోయారు. 1952లో జె. ఆనందరావు, ఎం. రాజమణిదేవి, 1957 అమృతలాల్ శుక్ల, కర్రెల్లి నర్సయ్యలు ఉమ్మడి నియోజకవర్గంగా కొనసాగిన సిరిసిల్ల నుంచి పిడిఎఫ్ అభ్యర్థులుగా గెలుపొందినా వారెవరూ రెండోసారి గెలుపొందక పోవడం గమనార్హం.

1983లో టిడిపి అభ్యర్థిగా వి. మోహన్‌రెడ్డి, 1989లో ఎన్‌వి. కృష్ణయ్య జనశక్తి, 1999లో ఆర్. పాపారావు కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించినా రెండోసారి వారు ఎమ్మెల్యేగా కాలేదు. అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన కెటిఆర్‌ను సిరిసిల్ల ప్రాంత ప్రజలు వదులుకోరనే విశ్వాసంతో మంత్రి కెటిఆర్ ప్రచారానికి పూర్తిస్థాయిలో హాజరు కావడం లేదు. బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఆయనపై ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉండటంతో ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ శ్రేణుల ప్రచారాన్ని నమ్ముకున్నారు.

మంత్రిగా కెటిఆర్ సిరిసిల్ల ప్రాంతంలో వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి అన్ని రంగాల్లో అభివృధ్ధికి సిరిసిల్లను మోడల్‌గా రూపొందించారు. సిరిసిల్ల ఒకప్పుడు నేతన్నల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి పార్లమెంట్ ప్రతినిధుల బృందం కూడా సిరిసిల్లను సందర్శించి వెళ్లినా దొరకని పరిష్కారాన్ని మంత్రి కెటిఆర్ బతుకమ్మ చీరెల రూపంలలో కనుగొన్నారు. ఊహించని విధంగా అవసరమున్న ప్రతిచోట రోడ్లు, వంతెనలు ఏర్పాటు చేయించారు.

వ్యవసాయ కళాశాల, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల,కెజి టు పీజీ విద్యాసంస్థ, జెఎన్‌టియు వంటి విద్యాసంస్థలు, మెడికళాశాలతో పాటు వైద్య రంగంలో ఆధునిక వసతులతో కూడిన అన్ని హంగులతో ఆసుపత్రులలో సదుపాయాలు మెరుగు పర్చి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్దిదారులకు అందించారు. ఇండ్లు రానివారికి స్థలాలిచ్చి గృహలక్ష్మి పథకం క్రింద నిధులు మంజూరు చేయించారు. సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి కెటిఆర్ ద్వారా ప్రభుత్వ పరమైన సహయాలు అందుకోని వ్యక్తి ఉన్నాడంటే బ్రహ్మండం బద్దలైనంత వింతగా చెప్పుకోవచ్చు.

సిరిసిల్ల నియోజక వర్గంలోని సిరిసిల్ల మున్సిపల్, తంగళ్లపల్లి, ముస్తాబాద్,గంభీరావుపేట, వీర్నపెల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజలకు అడిగిందే తడవుగా అన్ని పనులను చేసి పెట్టిన కెటిఆర్‌కు నిధుల కొరత సమస్య లేక పోవడం సిరిసిల్ల ప్రాంత ప్రజల అదృష్టంగా చెప్పుకోవాలి. సమస్యను కెటిఆర్ దృష్టికి తీసుకుపోవడమే ఆలస్యం అది ఏదో ఒక రకంగా పరిష్కారం అయిపోతుందనే అభిప్రాయాలను ప్రజల్లో కల్పించారు. సిరిసిల్లలో 2023 ఓటర్ల జాబితా ప్రకారం సిరిసిల్ల నియోజక వర్గంలో 2,40,798 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,17,872 మంది కాగా మహిళలు 1,22,920 మంది ఉన్నారు. ఆరుగురు ఇతరులుండగా 106 సర్వీస్ ఓట్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News