హైదరాబాద్ : రవాణాశాఖ (ఆర్టిఏ) అధికారులు తమ సేవలను మరింత పారదర్శకంగా వాహనదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం సుమారు 50కిపైగా రవాణాశాఖ సేవలను ఆన్లైన్ చేశారు. దాంతో వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే కొంత మంది వాహనదారులు అవగాహన లోపంతో ఆన్లైన్ సేవలను వారు పూర్తిగా వినియోగించుకోలేక వారు దళారులను ఆశ్రయిస్తున్నారు .దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఈ అంశాన్ని గమనించిన అధికారులు ఆన్లైన్ సేవలను వాహనదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు లెర్నింగ్ లైసెన్స్లపై దృష్టి సారించారు. పాత పద్దతిలో లెర్నింగ్ లైసెన్స్లు కావాలనుకునే వారు ముందుగా ఆర్టిఏ కార్యాలయానికి సంబందించిన ఆన్లైన్లోకి వెళ్ళి అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి.
స్లాట్లో పేర్కొన్న సమయానికి వారు ఆర్టిఏ కార్యాలయానికి చేరుకుని సంబంధిత కంప్యూటర్లో సంబంధిత పరీక్షలను రాయాల్సి ఉంటుంది. దానిలో ఉండే 20 మార్కులకు గాను కనీసం 12 పరీక్షలకు సరైన జవాబులు రాస్తే కనీసం రుసుము చెల్లించిన అనంతరం వారికి లెర్నింగ్ లైసెన్స్ను జారీ చేస్తారు. దీని కాల వ్యవధి సుమారు మూడు నెలలు ఉంటుంది. ఈ సమయంలో వారు సంబంధిత వానాలపై డ్రైవింగ్ నేర్చుకుని సమీపంలోని డ్రైవింగ్ ట్రాక్ వెళ్ళి ఆర్టిఏ అధికారులు ఆధ్వర్యంలో సదరు వాహానాన్ని నడపాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన అనంతరం సంబంధిత రుసుం చెల్లిస్తే వారికి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.
ఇంటి వద్దకే లెర్నింగ్ లైసెన్స్….
ప్రస్తుత విధానంలో లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణాశాఖ కార్యాలయానికి చెందిన వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయానికి కార్యాలయానికి స్వయంగా వచ్చి ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వాహనదారులు కార్యాలయానికి చేరుకోలేక పోవడమే కాక స్లాట్ క్యాన్సిల్ అవుతోంది. మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలంటే వారి దైనందని కార్యాక్రమాల్లో బిజీగా ఉండటంతో అది వారికి సాధ్యపడటం లేదు. దాంతో వారు దళారులను ఆశ్రయించి పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఇక నుంచి లెర్నింగ్ లైసెన్స్ కావాలనుకునే వారు తమ వద్ద ఉన్న ఫోన్లు లేదా కంప్యూటర్లలో రవాణాశాఖ కార్యాలయానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్లైన్లోనే సమాధానాలు రాయాలి.
దానిలోని 20 ప్రశ్నలకుగా గాను కనీసం 12 ప్రశ్నలకు సమాధానం రాస్తే సంబంధిత ఫీజును కూడా చెల్లిస్తే వారు సంబంధిత రవాణా కార్యాలయానికి రాకుండానే వారికి ఫోన్లు, లేదా కంప్యూటర్లలో సంబంధిత లెర్నింగ్ లైసెన్స్ అధికారులుతో జారీ చేయబడుతుంది. దీనికి నిర్ణీత గడువును అధికారులు విధించారు. గుడువులోగా ఆన్లైన్లో సమాధనాలు రాయాలి. లేక పోతే మళ్ళీ ఆన్లైన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ అంశంపై అధికారులు అధ్యయనం చేసి త్వరలో అమలు చేసేందకు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే రవాణాకార్యాలయాలకు వెళ్ళకుండానే ఇంటి వద్దనే సులువుగా లెర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు.