Sunday, April 28, 2024

దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత మాజీ స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేడీ సోమవారం మృతి చెందారు. భారత అలనాటి మేటి స్పిన్నర్లలో ఒకరిగా బిషన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. 1967 నుంచి 1979 మధ్య కాలంలో ఆయన టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు. పలు జట్లకు, ఆటగాళ్లకు బేడీ కోచ్‌గా వ్యవహరించారు.

అంతేగాక ప్రతిష్టాత్మకమైన బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవిని కూడా ఆయన నిర్వహించారు. ఇక క్రికెట్‌లో బేడీ సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. బేడీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. కెరీర్‌లో 67 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన బేడీ రికార్డు స్థాయిలో 266 వికెట్లు పడగొట్టారు. పది వన్డేల్లో కూడా భారత్ తరఫున ఆడారు. భారత్ వన్డేల్లో సాధించిన తొలి విజయంలో బేడీ కీలక పాత్ర పోషించారు. 1975 వరల్డ్‌కప్‌లో భాగంగా తూర్పు ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బేడీ 12 ఓవర్లలో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశారు. బేడీ బౌలింగ్ కోటాలో ఏకంగా 8 మెయిడిన్ ఓవర్లు ఉండడం విశేషం.

ఘన నివాళులు..
దిగ్గజ క్రికెటర్ మృతి భారత క్రికెట్‌ను శోకంలో ముంచి వేసింది. బేడీకి పలువురు క్రికెట్ ప్రముఖులు నివాళులు అర్పించారు. భారత క్రికెట్ ఐకాన్ కపిల్ దేవ్, కీర్తీ ఆజాద్, జహీర్ ఖాన్‌తో సహా పలువురు ప్రముఖులు బేడీకి శ్రద్ధాంఝలి ఘటించారు. పలువురు మాజీ క్రికెటర్లు బేడీ మృతి దేహంపై పుష్పగుచ్చం ఉంచి ఘన నివాళి సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News