‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి షాలిని పాండే. మొదటి సినిమాతోనే తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్న షాలిని తెలుగులో సినిమాలు చేస్తూనే తమిళ పరిశ్రమలోకి కూడ ప్రవేశించింది. ప్రస్తుతం ఈ రెండు పరిశ్రమల్లోనూ ఆమెకు ఆఫర్లు ఉన్నాయి. ఇక ఆమె బాలీవుడ్లోకి కూడ ప్రవేశిస్తోంది. ఇప్పటికే రణవీర్ సింగ్ చేయనున్న కొత్త చిత్రంలో కథానాయకిగా ఎంపికైంది షాలిని. ఇది ఆమె కెరీర్ను మలుపు తిప్పే అవకాశం. ఇది కాకుండా ఓ స్టార్ హీరో కుమారుడి డెబ్యూ సినిమాలో కూడ ఆమె కథానాయకిగా ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు అమీర్ ఖాన్. ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతని సరసన హీరోయిన్గా షాలిని ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. షాలిని పాండే యష్ రాజ్ ఫిలింస్ సంస్థతో మూడు సినిమాల ఒప్పందానికి సైన్ చేసిందట. అందులో భాగంగానే జునైద్ ఖాన్ సినిమాలో అవకాశం దక్కించుకుందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది.