చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వారసులుగా ఆమె మేన కోడలు దీపా మాధవన్, మేనల్లుడు దీపక్లను ప్రకటిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వీరిద్దరినీ జయలలితకు వారసులుగా హైకోర్టు స్పష్టం చేసింది. జయలలిత ఆస్తుల పర్యవేక్షణకు ఓ అధికారిని నియమించాలన్న ఎఐఎడిఎంకె పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తాజా తీర్పు నేపథ్యంలో పోయస్ గార్డెన్లోని జయలలిత నివాసాన్ని స్మారకంగా ఏర్పాటు చేయాలన్న ప్రణాళికను పునఃపరిశీలించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
కోర్టు ఆదేశాల మేరకు జయలలిత ఆస్తులన్నిటినీ తమకు బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని దీపా మాధవన్ కోరారు. కొడనాడ్లోని 1000 ఎకరాల ఎస్టేట్, హైదరాబాద్లోని ద్రాక్ష తోటసహా అన్ని ఆస్తుల్నీ తమకు బదిలీ చేయాలని ఆమె కోరారు. ఆ ఆస్తులకు ఎవరూ నష్టం కలిగించకుండా రక్షణ కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరారు. గతంలో ఓ పార్టీ ఏర్పాటు చేసిన దీప ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోసారి రాజకీయ ఆలోచన ఏమైనా ఉందా అని అడగగా, కాలం నిర్ణయిస్తుందన్నారు. మరో ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.