గాంధీనగర్: దేశంలో కరోనా వైరస్ కట్టడి కావాలని దేవుడి గుడిలో ఓ యువకుడు నాలుక కోసుకున్న సంఘటన గుజరాత్లోని బనాస్కాంతా జిల్లాలోని సుయిగమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధ్య ప్రదేశ్లోని మోరినా జిల్లాకు చెందిన వివేక్ శర్మ అనే వ్యక్తి దిన సరి కూలీ కోసం గుజరాత్ వలసపోయాడు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ విధించారు. దీంతో పనిలేకపోవడంతో ఇంట్లోనే వివేక్ ఉంటున్నాడు. సుయిగమ్ ప్రాంతంలో భవాని మాతా దేవాలయానికి వివేక్ వెళ్లాడు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం కోసం తన నాలుకను దేవునికి ఇస్తానని అనుకున్నాడు. వెంటనే నాలుకను కత్తితో కొసుకొని అక్కడే పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న వివేక్ను గుడి పూజారి గుర్తించి ఆర్మీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్మీ అధికారులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వివేక్ సోదరుడు శివమ్ కూడా అక్కడే పని చేస్తున్నాడు. దీంతో పోలీసులు అతడి సోదరుడు శివమ్కు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నాలుకను పూర్వస్థితికి తేవడం కష్టమని వైద్యులు వెల్లడించారు.