Monday, April 29, 2024

మెడికో ప్రీతి సోదరికి హెచ్‌ఎండిఎలో ఉద్యోగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాకతీయ మెడికల్ కాలేజీలో వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి సోదరి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు హెచ్‌ఎండిఎలో ఉద్యోగం ఇస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పిజి అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి యత్నించారు.

అపస్మారక స్థితిలోకి చేరుకున్నా ఆమెకు తొలుత వరంగల్ ఎంజిఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ తీసుకొచ్చారు. నిమ్స్ లో అయిదు రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి కన్నుమూసిన విషయం విధితమే. ప్రీతి సోదరి పూజకు హెచ్‌ఎండిఎ ఐటీ సెల్‌లో ఒప్పంద విధానంలో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇచ్చారు. ప్రీతి మృతి సమయంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రకటించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన నియోజకవర్గ పార్టీ తరపున విరాళాలను సేకరించి రూ.20 లక్షలు ప్రకటించి, ఆ మొత్తాన్ని వారికి అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News