Monday, April 29, 2024

మింగుడు పడని ఖ‘నిజాలు’!

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న మూడవ దేశం భారత దేశం. ఈ ఖనిజాలను ప్రజల జీవితానికి ఉపయోగపడేలా చేయాలి. వీటి గురించి ప్రాచీన కాలంనుంచి దేశ ప్రజలకు తెలుసు. భారత దేశంలోని ఖనిజ సంపద మీద దేశ ప్రజలందరికీ హక్కులు ఉంటాయని భారత జాతీయోద్యమం పేర్కొంది. ఖనిజ సంపద ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తి కాదని చెప్పింది. 1947లో అధికార మార్పిడి జరిగిన తర్వాత గనుల, ఖనిజ సంపదను జాతి సంపదగా గుర్తించి వాటిని నియంత్రించి, అభివృద్ధి చేసి పరిరక్షంచే బాధ్యతను ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం అప్పగించింది. తమ కోసం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని పవిత్రంగా భావించే దేశ పాలకులు ఆ రాజ్యాం గం అప్పగించిన బాధ్యతను కూడా ఉద్దేశపూర్వకంగా విస్మరించి, ఇతర రంగాల మాదిరిగానే ఖనిజ రంగాన్ని కూడా సామ్రాజ్యవాద కంపెనీలకు, ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద కంపెనీల దోపిడీకి నెహ్రూ దగ్గర నుండి మోడీ వరకు నిలయంగా మార్చారు. మోడీ ప్రభుత్వం గత పాలకులకు మించి ఖనిజ సంపద, గనులు, అటవీ భూములు ప్రైవేట్ వ్యక్తుల, బహుళ జాతి సంస్థలపరం చేస్తున్నది. ఫలితంగా దేశ ఖనిజ సంపద విదేశాలకు తరలిపోతున్నది.

Also Read: బిసి కులవృత్తులకు లక్ష ఆర్థిక సాయం

సామ్రాజ్యవాదులు ఇతర దేశాల సహజ ముడి సంపదను ఏ విధంగా తరలించుకుపోతున్నది, దోపిడీ చేస్తున్నది అన్న అంశాన్ని హారీ మాగ్డావ్ అనే మార్క్సిస్టు శాస్త్రవేత్త పేర్కొన్నారు. మార్క్సిస్టు సిద్ధాంత వేత్త కామ్రేడ్ లెనిన్ రాసిన సామ్రాజ్యవాదం- పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ అనే గ్రంథానికి 50 సంవత్సరాలు (2010) నిండిన సందర్భంగా న్యూయార్క్‌లో సోషలిస్టు మేధావుల సదస్సు జరిగింది. ఆ సదస్సులో హారీ మాగ్డావ్ కొత్త సామ్రాజ్యవాదం గురించి పత్రం ప్రజంట్ చేశాడు. ఆ పత్రంలో కొత్త ప్రపంచంగా మారినదేమిటో, మారనది ఏమిటో, మారిందని అనిపిస్తున్నది ఏమిటో ఆయన వివరించాడు. బడా పారిశ్రామిక వ్యాపారవేత్తలు, తమ గుత్తాధిపత్యాన్ని యథాతథంగా కొనసాగించాలంటే, తమ లాభాలను యథాతథంగా ఉంచుకోవాలనీ, పెంచుకోవాలని అనుకుంటే ముడి సరుకుల కోసం విదేశాలపై ఆధారపడక తప్పదని ఆ పత్రం ద్వారా రుజువు చేశాడు. అతి సాధారణమైన ఖనిజాల నుంచి అరుదైన ఖనిజాల దాకా అమెరికా నిరుపేద దేశంగానే ఉందని, అందువల్లనే సామ్రాజ్యవాద దురాక్రమణ దాహం మరింత పెరిగిందని ఆయన తిరుగులేని గణాంకాల ద్వారా వివరించారు. హారీ మాగ్డాడ్ అమెరికా అయినా మార్క్సిస్టు కాబట్టి అమెరికాను విమర్శించాడని అనుకుంటే, అమెరికా అధికారులు, ప్రభుత్వ విధానాల వివరణలో ఆయన చెప్పిన దాన్నే పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వ అత్యున్నత అధికారి స్టేట్ డిపార్ట్‌మెంటు విధాన నిర్ణయ శాకాధిపతి జార్జి కషన్ 1948లో లాటిన్ అమెరికా దేశాల రాయబారులకు అమెరికా ప్రభుత్వ విధానాలు వివరిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న ముడి సరుకులను కాపాడుకోవటం అమెరికా ప్రభుత్వ లక్ష్యాలలో ప్రధానమైందని అన్నారు. ఇది ఇతర దేశాల ముడి సరుకుల మీద, ఖనిజ వనరుల మీద అమెరికా విధానం వెల్లడవుతున్నది. అమెరికా వాడే బాక్సైట్‌లో 80 నుంచి 90% విదేశాల వనరుల నుంచే. ఈ బాక్సైట్ ద్వారా అల్యూమినియం తయారు చేసి దాన్ని యుద్ధ విమానాల తయారీకి, ఆయుధాల తయారీకీ ఉపయోగించి ఇతర దేశాలపై యుద్ధాలు చేస్తున్నది. ఈ అంశాన్ని మన ఖనిజాల గురించి, గనుల గురించి మాట్లాడుకునేటప్పుడూ తప్పని సరిగా తెలుసుకోవాల్సిన అంశం. అప్పుడే మన దేశ సహజ వనరులను, సంపదలను అమెరికా ఏవిధంగా తరలించుకుపోతున్నది అర్ధమవుతుంది.

భారత దేశంలో 95రకాల ఖనిజాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి విలువ రూ. 24 లక్షల కోట్లు. 501 మిలియన్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. దేశం నుంచి కొన్ని లక్షల టన్నుల ఖనిజాలు, ముడి లోహాలు బహుళ జాతి సంస్థల కార్ఖానాలకు, గిడ్డంగులకు తరలి వెళ్తున్నాయి. వేల కోట్ల రూపాయల్లో వీటి విలువ ఉంటుంది. ఖనిజాల వ్యాపారం ద్వారా స్వదేశీ, విదేశీ వ్యాపారులు వేల కోట్లు సంపాదిస్తున్నారు.ఖనిజ నిక్షేపాలు ఎవరి నేలలో ఉన్నాయో, వాటిని ఎవరు త్రవ్వి తీస్తున్నారో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఖనిజాలు ఉన్న ప్రాంతాలు, ఆదివాసీ, 5వ షెడ్యూల్, 1/70 ప్రాంతాలు, ఒడిశాలో ఉన్న 2/ఆఫ్ చట్ట సవరణ ప్రాంతాలైనా ఖనిజ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఖనిజ నిల్వలను బహుళ జాతి సంస్థల అక్రమంగా తరలించుకుపోతున్నాయి. కర్ణాటకలో గాలి జనార్ధన రెడ్డి గనుల త్రవ్వకాలు దేశం లో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దేశంలో గనుల త్రవ్వకం, ఖనిజాల వాడకం బ్రిటిష్ వలస పాలనలోనే మొదలైంది. భారత ఉప ఖండంలోని సహజ వనరులను కొల్లగొట్టి తమ దేశానికి తరలించుకుపోయి ముడి సరుకుగా వాడు కున్నారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే 1774లో రాణిగంజ్ లో మొదటి ఆధునిక బొగ్గు గనిని తెరవడంతో భారత దేశంలో పరాయి దేశాల ఖనిజ తరలింపు ప్రారంభమైంది. 8151లో బ్రిటిష్ ప్రభుత్వం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రారంభించింది. భూగర్భ గనుల శాఖను 1887లో ఏర్పాటు చేసింది. గనుల కోసం 1885లో భూ సంస్కరణల చట్టం చేసింది. 1923 భారత గనుల పాలనా చట్టం వంటి చట్టాలు చేసింది.

భారత రాజ్యాంగం గనులను, ఖనిజాభివృద్ధిని కేంద్ర జాబితాలోనూ, రాష్ట్రాల జాబితాలోనూ చేర్చింది. చమురు క్షేత్రాలు, చమురు సంబంధిత ఖనిజ విలువలు, పెట్రోలియం, వాటి ఉత్పత్తులు, నియంత్రణ, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తా యి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని ఇతర గనులు, ఖనిజాభివృద్ధి రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. గనులు, ఖనిజాల (నియంత్రణ- అభివృద్ధి) చట్టం 1957 ద్వారా భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం అల్యూమినియం, రాగి, జింక్, సీసం, బంగారం, నికెల్ వగైరా ఖనిజాలు కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కిందకు తెచ్చారు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలఫ్‌మెంట్ కార్పొరేషన్, స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా, భారత అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్, హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ వంటి కేంద్ర సంస్థలు ఏర్పడ్డాయి. భారత అల్యూమినియం కంపెనీని, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీని ప్రైవేటీకరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖనిజాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేశాయి. ఇవన్నీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా ప్రైవేట్ వ్యక్తుల, సంస్థల ప్రయోజనాలకే దోహద పడ్డాయి. ప్రభుత్వ రంగంలోని గనుల శాఖలను, సంస్థలను ప్రజానుకూలంగా ఖనిజాలను వెలికితీసి ఉంటే, ఖనిజ సంపద ప్రజలకు అందేది, కాని అలా జరగలేదు. పాలకులు అలాంటి విధానాలు అమలు జరపలేదు.

1947 నుంచి భారత పాలకులు గనుల రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే విధానాలనే అనుసరించారు. 1957 చట్టం లో గనుల త్రవ్వకానికి ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అప్పగించే వీలు కల్పించారు. 1960లో వెలువడిన ఖనిజాల రాయితీ నిబందనలు ప్రైవేట్ వ్యక్తుల, సంస్థల చేతికి ఖనిజ నిల్వలు కట్టబెట్టడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించారు. ఆర్థిక సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత 1988లో వెలువడిన ఖనిజాల సంరక్షణ, అభివృద్ధి నిబంధనలు ప్రైవేటీకరణ క్రమాన్ని పెంచాయి. 1993లో మొదటి సారిగా తయారైన జాతీయ ఖనిజ విధానం పూర్తిగా ప్రపంచీకరణ శక్తుల కనుసన్నల్లో బహుళ జాతిసంస్థల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా తయారు చేశారు. 1994లో మరింతగా చట్ట సవరణ చేసి ఇనుప ఖనిజం, రాగి, మాంగనీస్, సీసం, క్రోమ్ ఖనిజం, జింక్, గంధకం, బంగారం, వజ్రాలు, నికెల్ మొదలైన ఖనిజాలలోకి పెద్దఎత్తున ప్రైవేట్ సంస్థల, బహుళ జాతి సంస్థల ప్రవేశానికి అవకాశం కల్పించారు. ఈ అవకాశం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యు కె, దక్షిణాఫ్రికాకు చెందిన బహుళ జాతి సంస్థలు నేరుగాను, దళారుల ద్వారా ఈ రంగాల్లోకి ప్రవేశించాయి. 2006లోనూ చట్టంలో అనేక మార్పులు జరిగాయి. ఖనిజాల వ్యాపారంలో విపరీత లాభాలు ఉండటంతో స్థానిక పెత్తందార్లు, వ్యాపారులు, అధికారులు, రాజకీయ నాయకులు కలగలసి మాఫియాగా ఏర్పడ్డారు. ఈ మాఫియా బహుళ జాతి సంస్థలతో చేతులు కలిపింది. ప్రభుత్వ అనుమతుల ప్రకారం గనులు త్రవ్వితేనే 99% లాభాలు వస్తుంటే, అక్రమ త్రవ్వకాల ద్వారా వచ్చే లాభాలను ఊహించటం కష్టం. వారికి వచ్చే లాభాల్లో ఒక శాతం మాత్రమే ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేస్తుంది.

దేశంలోని ఖనిజ విలువలు, సంపదలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 50 పారిశ్రామిక ఖనిజాల వెలికితీత, ఉత్పత్తి జరుగుతున్నది. పెద్ద ఎత్తున వీటి వ్యాపారంలో పారిశ్రామికవేత్తలు వేల కోట్ల లాభాలు పొందుతున్నారు. దేశ ఖనిజ సంపద ద్వారా వ్యాపారం చేస్తున్న బహుళ జాతి సంస్థలు కెనడాకు చెందిన ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ కంపెనీ, యుఎస్‌ఎకి చెందిన పిలప్స్ డాడ్జ్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ, ఆస్ట్రేలియాకు చెందిన బి ఎచ్‌పి బిల్లిటన్, కెనడాకు చెందిన వెబుల్ క్రిక్ రిసోర్సెస్ కార్పొరేషన్, యుకె కి చెందిన రియో టింటో మినరల్స్ డెవలఫ్‌మెంట్ లిమిటెడ్, దక్షిణాఫ్రికాకు చెందిన డి బీర్స్ కన్సాలిడేటెడ్ మైన్స్ లిమిటెడ్, దక్షిణ కొరియాకు చెందిన పోస్కో, రష్యాకు చెందిన ఎంఎంకె, బ్రిటన్ నెదర్లాండ్‌కు చెందిన కోరస్, భారత దేశంలో జిందాల్ సౌత్ వెస్ట్ స్టీ, టాటా స్టీల్, ఎస్సార్ స్టీల్, యుకెకు చెందిన వేదాంత రిసోర్సెస్ మొదలైనవి ముఖ్యంగా ఉన్నాయి. దేశ ఖనిజ వనరులను, అటవీ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు, బహుళ జాతిసంస్థల కట్టబెట్టటానికి అడ్డంకిగా ఉన్న 1957 అటవీ హక్కుల పరిరక్షణ చట్టంలో మోడీ ప్రభుత్వం ముఖ్యమైన సవరణలు చేసింది. ఆ సవరణల ద్వారా అడ్డంకులు తొలగించి ఖనిజ సంపదను, అటవీ భూములను కార్పొరేట్ల పరం చేయటానికి సిద్ధమైంది. దీని ఫలితం ఆదివాసీ గిరిజన ప్రజలు భూములు, నివాస ప్రాంతాలు కోల్పోయి నిరాశ్రయులు అవుతున్నారు, అవబోతున్నారు. దేశ ప్రజలు సంపద కోల్పోతున్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశ ఖనిజ సంపద దేశ ప్రజల కోసం వినియోగించాలని, ఖనిజాలను, గనులను, అటవీ భూములను కార్పొరేట్లకు అప్పగించ రాదని, 1957 చట్టానికి చేసిన సవరణలను ఉపసంహరించాలని యావన్మంది భారత ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News