మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ఓ విపత్తుని కలిగించిందని, ఈ విపత్తు నుంచి బయట పడడానికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కార మార్గమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని ఉద్యానవనం, గన్మెన్, గార్డెనింగ్, పారిశుద్ధ్య తదితర విభాగాలకు చెందిన కార్మికులకు మంత్రి మంగళవారం నిత్యావసర సరుకులను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్ను క్రమశిక్షణతో పకడ్భందీగా పాటించాలని, తద్వారా కరోనా రాకుండా జాగ్రత్త పడాలని మంత్రి సూచించారు. కరోనాను నిర్మూలించడానికి అందరికంటే ముందే సిఎం కెసిఆర్ లాక్డౌన్ విధించారని, తద్వారా దేశం సహా, ప్రపంచంలో అందరికంటే ముందు మన రాష్ట్రమే కరోనా నివారణలో ముందుందన్నారు. ఇప్పటికే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు.