Thursday, May 9, 2024

ఆదర్శంగా గురుకుల విద్యాలయాలు

- Advertisement -
- Advertisement -

Minister Koppula Eshwar Review on Gurukulas

నిర్వహణ, పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల విద్యాలయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాహూల్ బొజ్జ, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా, సంయుక్త,ఉప, సహాయ కార్యదర్శులు, జోనల్, రీజినల్, జిల్లా కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ గురుకులాల నిర్వహణ, పురోగతి, సాధించిన ఫలితాలు,విజయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నర్సింగ్, ఇంజనీరింగ్, బాలుర కోసం 15 డిగ్రీ కాలేజీల ఏర్పాటు ప్రతిపాదన గురించి తెలుపగా.. మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వివిధ పోటీ పరీక్షలు, క్రీడలు అత్యుత్తమ ఫలితాలు సాధించిన, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించే సభను త్వరలో ఘనంగా నిర్వహిద్దామని మంత్రి వెల్లడించారు.

పేద విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ప్రారంభించారన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన, సంకల్పానికి అనుగుణంగా వీటిని మరింత గొప్పగా నిర్వహించడం, ఫలితాలు సాధించేందుకు మనమందరం బాధ్యతాయుతంగా ముందుకు సాగుదామన్నారు. అధికారులు పాఠశాలలను తరచూ సందర్శించాలని, హాజరు, తరగతుల నిర్వహణ, పరీక్షలు, ఫలితాలు, విజయాలపై మాత్రమే దృష్టి సారించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎస్సీ గురుకులాల నిర్వహణ, మరింత మెరుగుపర్చడం, విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అధికారులు, కో-ఆర్దినేటర్లు చెప్పిన విషయాలపై మంత్రి స్పందించారు. గురుకులాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News