Sunday, April 28, 2024

జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన.. షమీకి అర్జున అవార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2023 సంవత్సరానికిగాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను వెల్లడించింది. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి దేశ అత్యుత్తమ క్రీడ పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డును అందుకోనున్నారు. ఈ ఏడాది పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు అసాధారణ ఆటను కనబరిచారు.

ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు పలు టైటిల్స్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఈ జోడీ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్త్న్ర లభించింది. మరోవైపు తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్‌కు అర్జున అవార్డు లభించింది. తెలంగాణకు చెందిన బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్‌కు కూడా అర్జున అవార్డు వరించింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమికి ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు దక్కింది. భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్ అజయ్ రెడ్డికి కూడా అర్జున అవార్డు లభించింది.

ఈ ఏడాది 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను అందజేయనున్నారు. దీంతో పాటు ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో ఐదుగురు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కాగా, 2023 సంవత్సరానికిగాను జీవిత సాఫల్య పురస్కారం మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్ శర్మ (హాకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ)లకు దక్కింది. ద్రోణాచార్య రెగ్యులర్ కేటగిరిలో లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్.బి.రమేశ్ (చెస్), మహావీర్ ప్రసాద్ సైని (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేష్ ప్రభాకర్ (మల్లకంబ్)లను అవార్డులు లభించాయి. లైఫ్‌టైమ్ కేటగిరీలో జస్కీరత్ సింగ్ (గోల్ఫ్), భాస్కరన్ (కబడ్డీ), జయంత కుమార్ (టిటి)లకు ద్రోణాచార్య అవార్డులు దక్కాయి.

అర్జున విజేతలు వీరే..
ఓజస్ ప్రవీణ్ (ఆర్చరీ), అదితి గోపీచంద్ (ఆర్చరీ), శ్రీశంకర్ (అథ్లెటిక్స్), పారుల్ చౌదరి (అథ్లెటిక్స్), మహ్మద్ హుస్సాముద్దీన్ (బాక్సింగ్), ఆర్ వైశాలి (చెస్), మహ్మద్ షమి (క్రికెట్), అనూష్ అగర్వాలా (ఈక్వస్ట్రియన్), దివ్యకృతి సింగ్ (ఈక్వస్ట్రియన్ డ్రస్సెజ్), దీక్షా దాగర్ (గోల్ఫ్), నస్రీన్ (ఖోఖో), పింకి (లాల్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఇషా సింగ్ (షూటింగ్), పవన్ కుమార్ (కబడ్డీ), సుశీల చాను (హాకీ), ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్), అజయ్ రెడ్డి (అంధుల క్రికెట్), శీతల్ దేవి (పారా ఆర్చరీ), అంతిమ్ (రెజ్లింగ్), నౌరెమ్ రోషిబినా దేవి (వుషూ), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అహికా ముఖర్జీ (టిటి), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్కాష్), రితూ నేగి (కబడ్డీ), క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News