Monday, April 29, 2024

మానవతావాది మదర్ థెరిసా

- Advertisement -
- Advertisement -

Mother Teresa 110th Birth Anniversary

మదర్ థెరిసా అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. 26 ఆగస్టు 1910న స్కోప్ట్ పట్టణంలో నికోలే, బోజక్షుహ్యూ దంపతులకు జన్మించారు. 12 ఏళ్ల వయస్సులోనే సామాజిక సేవ చేయాలని నిర్ణయం తీసుకుని సన్యాసినిగా మారదామనుకుంటే చిన్న వయసు కావడంతో మారలేకపోయింది. నిజానికి ఆ వయసు పిల్లలు అందరూ ఆట పాటలతో అల్లరి చేస్తూ బాల్యాన్ని ఆనందంగా గడిపే వయ సు. కానీ ఆ వయసులోనే సేవ చేయాలనే ఆలోచన రావడం ఆమెకు సేవపై గల మక్కువను తెలియజేస్తున్నది. తన 18వ ఏట “నన్‌” గా మారి సేవలు అందించడం మొదలు పెట్టింది. 1929వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి డార్జిలింగ్‌లో ఉపాధ్యాయురాలిగా చేరింది.

కానీ ఆ సమయంలో తన చుట్టు పక్కల పేదరికంతో దుర్భర జీవితాన్ని గడుపుతున్న అభాగ్యులను గుర్తించి వారికి సేవ చేయడమే పరమావధిగా భావించి తన పేరును సిస్టర్ థెరిసాగా మార్చుకున్నది. మొదటి ప్రపంచ యుద్ధం ఆమెను గొప్ప మానవతావాదిగా మార్చింది. యుద్ధం సృష్టించిన పెను విధ్వంసం, ప్రజల్లో కలిగిన సంక్షోభం, గాయాల పాలైన వారి రోదనలు ఆమెను తల్లడిల్లేలా చేశాయి. యుద్ధం చేసిన గాయాలు చూసిన ఆమెలోని మానవత్వాన్ని రెట్టింపు చేసి వారందరిని ఆదుకునేలా చేశాయి. అసహాయ స్థితిలో గల వారందరికీ చేయూతనందించారు.1950లో వాటికన్ అనుమతితో మిషనరీ అఫ్ ఛారిటీని ప్రారంభించి, 1951లో భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించి ఎక్కువగా భారతీయులకే తన సేవలు అందించింది. ప్రపంచంలో ఎక్కడ విపత్తులు వచ్చినా, విధ్వంసాలు జరిగినా అక్కడికి వెళ్లి సేవలను అందించేవారు. భ్రుణహత్యలను వ్యతిరేకించారు.

అభాగ్యుల కొరకు, అనాథల కొరకు, శరణార్థుల కొరకు 1952లో కలకత్తాలో ‘నిర్మల్ హృదయ’ పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పి వారిని అక్కున చేర్చుకున్నారు. ‘శాంతి నగర్’ పేరుతో కుష్ఠు రోగులకు ఆసుపత్రి స్థాపించి అందులో భోజనం, వైద్య సదుపాయాలు కల్పించారు. తన ఆత్మీయ స్పర్శతో, పలకరింపుతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. మిషనరీ ఆఫ్ చారిటీ ద్వారా 123 దేశాలలో 610కి పైగా సంస్థలను స్థాపించి దాని ద్వారా 45 సంవత్సరాలకు పైగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా హెచ్‌ఐవి, కుష్ఠు, క్షయ వ్యాధిగ్రస్థులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య, భోజన వసతులు కల్పించి వారిని ఆత్మీయంగా చూసుకున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలలో పేదలకు, రోగగ్రస్థులకు, అనాథలకు, మరణ శయ్యపై ఉన్నవారందరికీ తన ఛారిటీ ద్వారా సేవలు అందించి గొప్ప మానవతావాదిగా, నిస్సహాయులకు అమ్మగా, శాంతి దూతగా అంతర్జాతీయ ఖ్యాతిని పొంది ‘మానవ సేవే మాధవ సేవ’ గా భావించిన మదర్ థెరిసాకు ప్రపంచ దేశాలు ఎన్నో అవార్డులు, బిరుదులను ఇచ్చి సత్కరించాయి.

వాటిలో ముఖ్యంగా 1962లో పద్మశ్రీ, రామన్ మెగాసేస్ శాంతి బహుమతి, 1972లో జవహర్ లాల్ నెహ్రూ అవార్డు, 1980లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ అవార్డును పొందారు. పేదరికాన్ని తొలగించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె కృషికి గాను 1979లో ‘నోబుల్ శాంతి బహుమతి’ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తం గా ఆమె చేసిన సేవలు నిరుపమానం. ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రపంచం వ్యాప్తంగా మదర్ థెరిసా స్ఫూర్తితో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వెలిశాయి.మదర్ థెరిసా జీవితం సమాజ సేవకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. తాను మరణించే వరకు కూడా పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనారు. 1997 సెప్టెంబర్ 5న ఎనభైయేడు సంవత్సరాల వయసులో మదర్ థెరెసా మరణించారు. ‘ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అనే మదర్ థెరెసా మాటలను మనమందరం మననం చేసుకుంటూ మదర్ థెరెసా చూపిన మానవత్వాన్ని, దయార్ద హృదయాన్ని, సేవలను ఆచరించడమే ఆమెకు మనమివ్వగలిగే ఘనమైన నివాళి.

* పుల్లూరు వేణుగోపాల్-  9701047002

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News