Sunday, April 28, 2024

పేదల సంక్షేమమే సర్కార్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మరిపెడ : దేశానికి దిశా నిర్ధేశం చేసిన నాయకుడు సిఎం కెసిఆర్ ఒక్కడేనని, దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక సిఎం కెసిఆర్ అని, అనేక మంచి పనులు చేస్తున్న సిఎం కెసిఆర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని మహబూబాబాద్ బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపి మాలోతు కవిత అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల, రాంపురం, బురికితండా గ్రామ పంచాయితీల పరిధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలకు ఎంపి మాలోతు కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా ఆయా గ్రామాల్లో బిఆర్‌ఎస్ శ్రేణులు ఎంపి, ఎమ్మెల్యేలకు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, నృత్యాలు, డాన్స్‌లతో పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలికారు. అనంతరం చిల్లంచర్ల సర్పంచ్ నూర్జహాన్ సత్తార్, రాంపురం సర్పంచ్ రామసహాయం లావణ్య నర్సింహారెడ్డి, బురికితండా సర్పంచ్ అజ్మీరా వీరన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ముచ్చటగా సిఎం కెసిఆర్ గెలుపొందడం ఖాయమన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు. సిఎం కెసిఆర్ స్వయంగా రైతు బిడ్డ, రైతు కష్టాలు తెలిసిన నేత అని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సిఎం కెసిఆర్ రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను నిర్మించి పుష్కలంగా సాగునీరు అందించడంతో వ్యవసాయం పండుగలా మారి నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టేస్ధాయికి ఎదిగి అన్నపూర్ణగా మారిందన్నారు. ఇంటి స్థలాలు ఉంటే అర్హులైన వారికి ఇండ్లు ఇస్తామన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరించాలన్నారు. పేదల సంక్షేమమే లక్షంగా అహర్నిశలు కృషి చేస్తున్న సిఎం కెసిఆర్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను మారోమారు ఆశీర్వదించాలని తెలిపారు.

డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమం సాగించి.. రాష్ట్రం సాధించిన తర్వాత కరువును పారద్రోలి, రాష్ట్రంలోని బీడు భూములన్నీ పచ్చని పంటలతో సస్యశ్యామలం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరాయి ఆంధ్ర పాలనలో తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపి అన్యాయం చేశారని విమర్శించారు. నాడు తాగు, సాగు నీటికి అరిగోస పడ్డామని.. నేడు ఆ కష్టాన్ని తొలగించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. నాడు కరెంట్ ఉంటే వార్త అని, నేడు కరెంట్ పోతే వార్త అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కరెంట్ 7 గంటలుంటే, అందులో ఉదయం 4 గంటలు, రాత్రి 3 గంటలు వచ్చేదని, దీంతో రాత్రి సమయంలో పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి చాల మంది రైతులు వృత్యువాత పడ్డారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సిఎం కెసిఆర్ విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు.

కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మించి పుష్కలంగా సాగునీరు అందించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో భీడువారిన భూములు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారి సంవృద్ధిగా పంటులు పండుతున్నాయని తెలిపారు. రైతుల ఇబ్బంది పడకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్ వంటి అనేక పథకాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నామన్నారు. ఇంటి జాగలు ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని, అర్హులైన వారికి దళిత బంధు పథకం కింద యూనిట్లు అందజేస్తామన్నారు.

గ్రామాల్లో ఉన్న తాగునీరు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను అదేశించారు. కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి బిఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ తొమ్మిదేళ్లలో అన్ని వర్గాలకు సిఎం కెసిఆర్ న్యాయం చేశారని తెలిపారు. 14 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగేలా పని చేసిన నాయకుడినే ప్రజలు ఆదరిస్తారని, తన జీవితం ప్రజాసేవకే అంకితం చేశాన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, వైస్ ఎంపిపి గాదె అశోక్‌రెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు కుడితి మహేందర్‌రెడ్డి, గుగులోతు వెంకన్న, రామడుగు అచ్యుత్‌రావు, గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, అయూబ్‌పాషా, ఎంపిటిసి కొమ్ము నరేష్, కేసముద్రం మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ రాంపెల్లి రవిగౌడ్, విఓఏల జిల్లా అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి, మహిళా మండల అధ్యక్షురాలు అశ్విని రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబోద్దీన్, ఎస్‌టిసెల్ మండల అధ్యక్షులు అజ్మీరా రెడ్డినాయక్, జయపాల్‌రెడ్డి, పిట్టల ధనుంజయ్, సుధాకర్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు బంధు పరశురాములు, నూక రవి, తహశీల్దార్ పిల్లి రాంప్రసాద్, అనంతుల లక్ష్మినర్సు, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్, ఎంపిఓ పూర్ణచందర్‌రెడ్డి, పిఆర్ ఏఈ శ్రీనివాస్, కార్యదర్శులు నూతక్కి శ్రీరామకృష్ణ, ఉమేష్ చంద్ర, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News