Monday, April 29, 2024

‘నమస్తే ట్రంప్’ వల్లే దేశంలో కరోనా వ్యాప్తి: ప్రధానిపై విసుర్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: కొవిడ్ మహమ్మారి కాలంలో ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురిచేయడంతోనే ముంబై నుంచి వలస కార్మికులు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు పారిపోయారంటూ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పార్లమెంట్‌లో చేసిన ఆరోపణను మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తిప్పికొట్టారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాని మోడీ నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమమే ప్రధాన కారణమని మాలిక్ మంగళవారం విమర్శించారు. 2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని సందర్శించారు. తన పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొని లక్షలాది మంది పాల్గొన్న ఆ సభలో ట్రంప్ ప్రసంగించిన విషయం తెలిసిందే. కొవిడ్ మహమ్మారి కాలంలో కాంగ్రెస్ అన్ని హద్దులను దాటేసిందని, ముంబై నుంచి వలస కార్మికులు తమ స్వరాష్ట్రాలకు పారిపోయేలా వారిని ఆ పార్టీ భయపెట్టిందని లోక్‌సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఎన్‌సిపి ప్రధాన అధికారప్రతినిధి కూడా అయిన మాలిక్ స్పందిస్తూ అంతర్జాతీయ విమానాలను నిషేధించాలని ఒకపక్క మహారాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంటే మరోపక్క కరోనావైరస్ వ్యాపించదంటూ అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారని గుర్తు చేశారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాని మోడీ పూర్తి బాధ్యులని మాలిక్ ఆరోపించారు. వలస కార్మికుల ప్రయాణ టిక్కెట్ల ఖర్చును ప్రతిపక్షాలు చెల్లించాయని ప్రధాని చెప్పారని, ఇది వాస్తవమని ఆయన అన్నారు. మీరు ప్రత్యేక రైళ్లు వేస్తే ఆ టిక్కెట్ల ఖర్చు మేము భరించామని మాలిక్ ప్రధాని మోడీనుద్దేశించి స్పష్టం చేశారు. వలస కార్మికుల నుంచి కూడా టిక్కెట్ల డబ్బులు వసూలు చేయాలని కేంద్రం చూసిందని ఆయన విమర్శించారు.

Nawab Malik Slams PM Modi’s fixation with ‘Namaste Trump’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News