మనతెలంగాణ/హైదరాబాద్ః విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫసర్ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్ఐఎ సోదాలు జరిపింది. ఈక్రమంలో తాజాగా ఎన్ఐఎ ఆయనకు నోటీసులు పంపింది. ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఐఎ నోటీసుల్లో ఆదేశించింది. ఎన్ఐఎ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫసర్ సత్యనారాయణ మాట్లాడుతూ భీమా-కొరెగావ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ప్రొఫసర్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
NIA served notice to Varavara rao son-in-law