Monday, April 29, 2024

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం ఉదయం విడుదల కావడంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైందని చీఫ్ ఎన్నికల కార్యాలయం శనివారం ప్రకటించింది. నామినేషన్ల స్క్రూటినీ ఈనెల 31న జరుగుతుంది. బీజేపీ పాలనలో ఉన్న ఈ రాష్ట్రంలో నవంబర్ 17న మొత్తం 230 నియోజక వర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 230 నియోజక వర్గాలకు కాంగ్రెస్ 229 మంది అభ్యర్థులను ప్రకటించగా, పాలకవర్గం బీజేపీ ఇంతవరకు 136 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలో ఉన్నాయి. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు, బీజేపీ 109 స్థానాలు గెలుచుకున్నాయి. కమల్‌నాథ్ నేతృత్వంలో ఎస్‌పి, బీఎస్‌పి, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఒకవర్గం కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు ,

ముఖ్యంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఎమ్‌ఎల్‌ఎలు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 2020 మార్చిలో మళ్లీ అధికారం లోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో మొత్తం 5,60,60,925 మంది ఓటర్లలో 2,88,25,607 మంది పురుషులు కాగా, 2,72,33,945 మంది మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్ 1373 మంది వరకు ఉన్నారు. మొత్తం 78,303 మంది సర్వీస్ ఓటర్లలో 73,020 మంది పురుషులు కాగా, 2,284 మంది మహిళలు ఉన్నారు. సీనియర్ సిటిజెన్ ఓటర్లు మొత్తం 6,53,640 కాగా, దివ్యాగ ఓటర్లు 5,05,146 మంది , ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 99 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లతో కలుపుకుని మొత్తం ఓటర్ల సంఖ్య 5,61,36, 229 అయినప్పటికీ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరు ఉన్నారో వారిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారని పోలింగ్ అధికార వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News